Jagan: జగన్ ను కలిసేందుకు రేపు చిరంజీవి వెళ్తున్నారు: తమ్మారెడ్డి భరద్వాజ
![Tomorrow Chiranjeevi going to meet Jagan says Thammareddy Bharadwaja](https://imgd.ap7am.com/thumbnail/cr-20220209tn6203a6e87a3d1.jpg)
- సినీ పరిశ్రమకు ఆన్ లైన్ టికెటింగ్ పెద్ద సమస్య
- టికెట్ల రేట్ల తగ్గింపు వల్ల ఎక్కువమంది సినిమాలు చూశారు
- నంది అవార్డులను ఇవ్వాలని అడుగుతాం
- ప్రభుత్వాల నుంచి సినిమాలకు సబ్సిడీని ఆశిస్తున్నామన్న భరద్వాజ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో రేపు చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు భేటీ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని... చిరంజీవి రేపు జగన్ ను కలిసేందుకు వెళ్తున్నారని చెప్పారు. నేరుగా కలిసి చర్చిస్తే సమస్యల తీవ్రత తెలుస్తుందని అన్నారు.
సినీ పరిశ్రమకు ప్రైవేట్ ఆన్ లైన్ టికెటింగ్ పెద్ద సమస్య అని తమ్మారెడ్డి చెప్పారు. ప్రభుత్వం, ఛాంబర్ కలిసి ఆన్ లైన్ వ్యవస్థ పెట్టాలనేది తమ ఆలోచన అని అన్నారు. క్యూబ్ సిస్టమ్ వల్ల కూడా సమస్యలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో టికెట్ ధరలు పెంచడం వల్ల థియేటర్లో సినిమాలు చూడటాన్ని తగ్గించారని... ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు వల్ల ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూశారని అన్నారు. అఖండ, పుష్ప సినిమాలను ఆంధ్రలో బాగా ఆదరించారని చెప్పారు.
5వ షోకు పర్మిషన్ ఇస్తే చిన్న సినిమాలకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వాన్ని అడగబోతున్నామని తెలిపారు. నంది అవార్డులను ఇవ్వాలని కోరనున్నామని చెప్పారు. ప్రభుత్వాల నుంచి సినిమాలకు సబ్జిడీ ఆశిస్తున్నామని తెలిపారు. సినిమా థియేటర్లకు కరెంట్ ఛార్జీలు కమర్షియల్ గా కాకుండా యాక్చువల్ గా ఉండాలని చెప్పారు.
జగన్ చిరజీవిని పిలిచారని.. ఆయన వెళ్తే ఇండస్ట్రీ గురించి మాట్లాడతారని అన్నారు. పరిశ్రమ పెద్ద మనుషులు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తారని... ఎవరు ఏది చేసినా పరిశ్రమ మేలు కోసమేనని చెప్పారు.