omicron: తెలంగాణ‌లో ఒమిక్రాన్ కేసులు.. రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌

Omicron Alert in ts

  • ఒమిక్రాన్‌పై వైద్య ఆరోగ్య శాఖ అప్ర‌మ‌త్త‌మైంది
  • రాష్ట్రంలో తొలిసారిగా రెండు పాజిటివ్ కేసుల న‌మోదు
  • ఒమిక్రాన్ సోకిన వారిలో ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా క‌న‌ప‌డుతున్నాయి
  • వేగంగా వ్యాప్తి చెందుతోందన్న ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు 

తెలంగాణ‌లో ఇద్ద‌రు ఒమిక్రాన్ కేసుల బాధితులు ఉన్నార‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ గడల శ్రీనివాసరావు ఈ రోజు హైద‌రాబాద్‌లో మీడియా స‌మావేశం నిర్వహించి ప‌లు వివ‌రాలు తెలిపారు. ఒమిక్రాన్‌పై వైద్య ఆరోగ్య శాఖ అప్ర‌మ‌త్త‌మైందని అన్నారు.

రాష్ట్రంలో తొలిసారిగా రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయ‌ని శ్రీనివాస‌రావు అధికారికంగా ప్ర‌క‌ట‌న చేశారు. ఒమిక్రాన్ సోకిన వారిలో ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా క‌న‌ప‌డుతున్నాయని ఆయ‌న అన్నారు. త‌ల‌నొప్పి, నీరసం, జ‌లుబు, ద‌గ్గు వంటివి ఉంటున్నాయని వివ‌రించారు.

కెన్యాకు చెందిన 24 ఏళ్ల యువ‌తి ఈ నెల 12న రాష్ట్రానికి వ‌చ్చిందని, ఆమెకు ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలిందని ఆయ‌న వివ‌రించారు. సోమాలియాకు చెందిన 23 ఏళ్ల ఓ వ్య‌క్తికి కూడా ఒమిక్రాన్ సోకిన‌ట్లు చెప్పారు. వారిద్ద‌రూ హైద‌రాబాద్‌లోని టోలీచౌకిలో ఉండ‌డానికి వ‌చ్చార‌ని వివ‌రించారు. బాధితుల‌ను టిమ్స్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నామన్నారు. ఒమిక్రాన్‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం నిపుణుల వ‌ద్ద కూడా లేదని ఆయ‌న చెప్పారు. ఇప్పుడే అది వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆయ‌న అన్నారు.

మ‌రో వ్య‌క్తికి ఎయిర్‌పోర్టులో పాజిటివ్ గా తేలిందని, ఆ వ్య‌క్తి ప‌శ్చిమ బెంగాల్‌కు చెంద‌ని వ్య‌క్తి అని, రాష్ట్రంలోకి రాలేదని శ్రీనివాసరావు వివ‌రించారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఇద్ద‌రు ఒమిక్రాన్ బాధితులు మాత్ర‌మే ఉన్నారని ఆయ‌న అన్నారు.

ప్ర‌స్తుతం 77 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు ఉన్నాయని తెలిపారు. ప్ర‌జ‌లు అజాగ్ర‌త్తతో వ్య‌వ‌హ‌రిస్తే వారి కుటుంబ స‌భ్యులు కూడా ఒమిక్రాన్ బారిన‌ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పారు. త‌ప్ప‌కుండా మాస్కు పెట్టుకోవాల్సిందేన‌ని సూచించారు. మాస్కు ధ‌రించ‌డం, సామాజిక దూరం పాటించ‌డం వంటి చ‌ర్య‌లు తీసుకుంటే వ్యాప్తిని త‌గ్గించ‌వ‌చ్చ‌ని చెప్పారు.

వ్యాక్సిన్లు అంద‌రూ తీసుకోవాల‌ని, వ్యాక్సిన్లు వేయించుకుంటే ఒమిక్రాన్ తీవ్ర‌త‌ను త‌గ్గించ‌వ‌చ్చ‌ని చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు యూకేలో మాత్ర‌మే ఒక్క ఒమిక్రాన్ మ‌ర‌ణం సంభ‌వించింద‌ని వివ‌రించారు. రాష్ట్రంలో స‌మావేశాలు, ఉత్సవాల స‌మ‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని ఆయ‌న సూచించారు. రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు వ‌చ్చిన నేప‌థ్యంలో తాము మ‌రింత అప్ర‌మ‌త్త‌మ‌య్యామ‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News