Pawan Kalyan: అప్పుడు అమ్మ ఒడి... ఇప్పుడు అమ్మకానికో బడి: వైసీపీ సర్కారుపై పవన్ కల్యాణ్ విమర్శలు

Pawan Kalyan slams YCP Govt decision on Aided institutions

  • నేడు బాలల దినోత్సవం
  • సోషల్ మీడియాలో పవన్ స్పందన
  • పిల్లల హక్కులు ప్రభుత్వమే హరిస్తోందని ఆగ్రహం
  • ఎయిడెడ్ స్కూళ్లపై ప్రభుత్వ పాలసీని తప్పుబట్టిన జనసేనాని

నేడు బాలల దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో స్పందించారు. నేటి బాలలే రేపటి పౌరులు అని చెబుతుంటామని, కానీ పిల్లల హక్కులకు పాటుపడాల్సిన ప్రభుత్వ పెద్దలే వారి హక్కులను హరించివేస్తున్నారని విమర్శించారు.

కనీసం వారికి ఇష్టమైన మాధ్యమంలో చదువుకునే అవకాశం కూడా వారికి లేకుండా చేస్తున్నారని, మధ్యాహ్న భోజనంలో నాణ్యమైన ఆహారాన్ని అందించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి మా పాఠశాల తీసేయొద్దు అంటూ ఆ పసివాళ్లు ఆందోళన చేసే పరిస్థితులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అప్పుడు అమ్మ ఒడి అన్నారు, ఇప్పుడు అమ్మకానికో బడి అంటున్నారని విమర్శించారు.

ఎయిడెడ్ పాఠశాలల విలీనంపై ఏపీ సర్కారు నవంబరు 12న నాలుగు ఆప్షన్లతో సర్క్యులర్ మెమో ఇచ్చిందని పవన్ వెల్లడించారు. ఈ విధానం కారణంగా రాష్ట్రంలో 2,200 ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు, 2 లక్షల మంది విద్యార్థులతో పాటు 6,700 మంది టీచర్లు ప్రభావితమవుతారని తెలిపారు. అంతేకాకుండా 182 ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు, 71 వేల మంది విద్యార్థులు, 116 ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, 2.5 లక్షల మంది విద్యార్థులు నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని వివరించారు. ఆయా ఎయిడెడ్ విద్యాసంస్థల సిబ్బంది, వారి కుటుంబ సభ్యులపైనా ఈ ప్రభావం పడుతుందని తెలిపారు.

ముఖ్యంగా నష్టపోయేది విద్యార్థులేనని, ఎయిడెడ్ విద్యాసంస్థలను స్వాధీనం చేసుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ఎందుకింత హడావుడి చేస్తుందో అర్థంకావడంలేదని వ్యాఖ్యానించారు. విద్యా సంవత్సరం మధ్యలో ఉండగా, ఒక అనాలోచిత విధానాన్ని అమలు చేయడం సరైన నిర్ణయమేనా అని ప్రశ్నించారు.

ఒకవేళ ఎయిడెడ్ పాఠశాలలకు ప్రభుత్వం నిజంగా సాయపడాలని అనుకుంటే వాటిని విలీనం చేసుకోవడం ఒక్కటే మార్గమా? ప్రభుత్వం వద్ద ప్రత్యామ్నాయ విధానాలు ఏవీ లేవా? అని నిలదీశారు. వైసీపీ సర్కారు దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

"విద్యాసంవత్సరం మధ్యలో ఉండగా ఎయిడెడ్ పాఠశాలలు మూసివేస్తామంటున్నారు. ఆ విద్యార్థులను సమీపంలోని ఇతర విద్యాసంస్థల్లో చేర్చుతామంటున్నారు... దాంతో వారు ఆ విద్యాసంవత్సరంలో కుదుపులకు గురికారా? వైసీపీ ప్రభుత్వం ఇంతకీ ఉపాధ్యాయ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తుంది? రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఎప్పుడు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తుంది? ముందు ప్రభుత్వ విద్యాసంస్థల్లో టీచర్లను, లెక్చరర్లను నియమించి, ఆ తర్వాత ఎయిడెడ్ విద్యాసంస్థల గురించి ఆలోచించండి" అని పవన్ కల్యాణ్ హితవు పలికారు.

  • Loading...

More Telugu News