KRMB: కృష్ణా నది ప్రాజెక్టులపై తక్షణమే వివరాలు సమర్పించాలని తెలుగు రాష్ట్రాలను కోరిన కేఆర్ఎంబీ

KRMB wants AP and Telangana projects details
  • ఏపీ, తెలంగాణ ఈఎన్సీలకు లేఖ
  • అవుట్ లెట్ల ప్రవాహాలు తదితర వివరాలు కోరిన కేఆర్ఎంబీ
  • 30 ఏళ్ల డిమాండ్ వివరాలు కూడా అందించాలని స్పష్టీకరణ
  • ఈ నెల 17న జలసౌధలో గోదావరి బోర్డు భేటీ
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) తాజాగా తెలుగు రాష్ట్రాల నీటి పారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ లకు లేఖ రాసింది. కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, జూరాల, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల వివరాలను వెంటనే సమర్పించాలని ఏపీ, తెలంగాణ ఈఎన్సీలను కోరింది. ప్రాజెక్టుల అవుట్ లెట్ల నీటి ప్రవాహాలు, గేట్ల నిర్వహణ, ఫ్లడ్ హైడ్రోగ్రాఫ్, రిజర్వాయర్ రూటింగ్ స్టడీ వివరాలు అందించాలని తెలిపింది. అంతేకాదు, ఆయా ప్రాజెక్టుల పరిధిలో 30 ఏళ్ల డిమాండ్ వివరాలను కూడా సమర్పించాలని పేర్కొంది.

అటు, ఈ నెల 17న హైదరాబాదులో గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) ఉపసంఘం సమావేశం కానుంది. జలసౌధలో జరిగే ఈ భేటీలో ప్రధానంగా కాకతీయ కాలువ క్రాస్ రెగ్యులేటర్ పై చర్చించనున్నారు. అంతేకాకుండా, చాగలనాడు, దేవాదుల, తొర్రిగెడ్డ ఎత్తిపోతల పంప్ హౌస్ లపైనా చర్చించనున్నారు.
KRMB
Projects
Krishna River
Andhra Pradesh
Telangana

More Telugu News