Kannababu: ఏపీకి మూడు రాజధానులు ఖాయం: మంత్రి కన్నబాబు

Kannababu says three capitals for AP sure

  • అమరావతి ఉద్యమానికి 600 రోజులు
  • ప్రజలను మభ్యపెడుతున్నారంటూ కన్నబాబు విమర్శలు
  • చంద్రబాబు మోసగిస్తున్నారని వ్యాఖ్యలు
  • అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తామని ఉద్ఘాటన

ఏపీ మంత్రి కురసాల కన్నబాబు తాజా పరిణామాల నేపథ్యంలో తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఏపీకి మూడు రాజధానుల విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని అన్నారు. రాష్ట్రానికి కచ్చితంగా మూడు రాజధానులు ఉంటాయని వెల్లడించారు. అమరావతి ఉద్యమం పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఐదేళ్ల పాటు ఎలాంటి అభివృద్ధి చేయకుండా కాలయాపన చేసిన చంద్రబాబు, ఇప్పుడు ఉద్యమం పేరుతో ప్రజలను మోసగిస్తున్నారని మండిపడ్డారు.

"600 రోజుల పండుగ అంటూ అక్కడి ప్రజలను మోసం చేయవద్దు. కచ్చితంగా 3 రాజధానులు ఉంటాయి. చంద్రబాబు రైతుల నుంచి భూములను లాక్కుని పప్పుబెల్లంలా పంచాడు. చంద్రబాబు, లోకేశ్ హైదరాబాదులో కూర్చుని ఏపీలో రాజకీయం చేయాలనుకుంటున్నారు. మీరు చేస్తే ఉద్యమాలు... దళితులు చేస్తే అల్లరి మూకలా? చంద్రబాబు బేషరతుగా దళితులకు క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు పోరాటం రియల్ ఎస్టేట్ కోసమైతే, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం జగన్ పాటుపడుతున్నారు. మట్టి, నీరు తెచ్చి పండుగ చేసే ప్రభుత్వం కాదు మాది... సీఎం జగన్ ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తుంది" అని కన్నబాబు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News