Vijayashanti: కేసీఆర్ ప్రభుత్వంపై విజయశాంతి విమర్శలు

Vijayashanthi fires on TRS govt

  • రెవెన్యూ వ్యవస్థ రైతుల పాలిట దారుణంగా తయారయింది
  • లంచం ఇవ్వలేక ఒక మహిళ రెవెన్యూ కార్యాలయం గుమ్మానికి తాళిబొట్టు వేలాడదీసింది
  • ధరణి వెబ్ సైట్ సవాలక్ష సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటోంది

టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ రైతుల పాలిట ఎంత దారుణంగా మారిందనే విషయం చెప్పడానికి గత రెండు రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలే నిలువెత్తు సాక్ష్యాలని ఆమె అన్నారు. సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగిలో ఒక మహిళ తన భూమి సమస్య పరిష్కారం కోసం లంచం ఇవ్వలేక తహసీల్దార్ కార్యాలయం గుమ్మానికి తాళిబొట్టు వేలాడదీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు మెదక్ జిల్లా తాళ్లపల్లి తండాలో మరణించిన మాలోత్ బాబు అనే రైతుకు పట్టాదారు పాస్ బుక్ రాకపోవడంతో ఆ కుటుంబానికి రైతుబీమా పరిహారం, రైతుబంధు అందలేదని అన్నారు. ఈ నేపథ్యంలో శివ్వంపేటలోని తహసీల్ కార్యాలయం వద్ద తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయని చెప్పారు.

రెవెన్యూ లోపాలపై ప్రతి పత్రికలో, ప్రతి ఛానల్ లో ఈ సంఘటనలే ప్రధాన అంశాలుగా కనిపించాయని విజయశాంతి అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రైతులకు ఇలాంటి అనుభవాలు ప్రతిరోజు ఎదురవుతూనే ఉన్నాయని విమర్శించారు. కొంతమంది రైతులకు అరకొరగా రైతుబంధు డబ్బులు అందినా... పాత బాకీల కింద బ్యాంకులు జమ చేసుకునే పరిస్థితి ఉందని చెప్పారు.

ఈ ఇబ్బందులతో పాటు నకిలీ విత్తనాలు, పంట కొనుగోళ్ల ఇబ్బందులు ఉండనే ఉన్నాయని విజయశాంతి దుయ్యబట్టారు. భూ సమస్యలకు సర్వరోగ నివారణి అని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంటున్న ధరణి వెబ్ సైట్ సవాలక్ష సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటోందని మండిపడ్డారు. ఈ వెబ్ సైట్ రైతులతో పాటు, ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడుతోందని అన్నారు. తెలంగాణలో ఎలాంటి అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయో చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలని చెప్పారు.

Vijayashanti
BJP
TRS
Dharani Web
  • Loading...

More Telugu News