Raghu Rama Krishna Raju: రఘురామ కృష్ణరాజు కేసు.. నేడు సుప్రీంలో కీలక విచారణ

Raghu Rama Krishna Raju Case Supreme Court Hear Today

  • నేటి మధ్యాహ్నం 12 గంటలకు విచారణ ప్రారంభం
  • ఇప్పటికే కోర్టుకు చేరిన రఘురామ వైద్య పరీక్షల నివేదిక
  • అఫిడవిట్‌లో తన చర్యను సమర్థించుకున్న ఏపీ ప్రభుత్వం

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు కేసులో నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం నేటి మధ్యహ్నం 12 గంటలకు ఈ కేసును విచారించనుంది. రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన రఘురామకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్య పరీక్షల నివేదికను తమకు అందించాలని ఈ నెల 17న సుప్రీంకోర్టు ఆదేశించింది. అందుకు సంబంధించిన నివేదిక ఇప్పటికే కోర్టుకు చేరింది.

మరోవైపు, బెయిలు కోసం రఘురామ పెట్టుకున్న స్పెషల్‌ లీవ్ పిటిషన్‌కు కౌంటర్‌గా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ కూడా పరిశీలనలో ఉంది. గురువారం జరిగిన విచారణలో రఘురామ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. రఘురామ రాజు తన ప్రసంగాల్లో ఎక్కడా హింసను రెచ్చగొట్టలేదని స్పష్టం చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందన్న ఉద్దేశంతో ఇప్పటికే వై సెక్యూరిటీని కూడా పొందారని కోర్టుకు తెలిపారు. కాబట్టి ఆయనకు బెయిలు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. రఘురామ పిటిషన్‌కు జవాబిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నేటి వరకు వాయిదా కోరింది. ఈ నేపథ్యంలో నిన్న కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ప్రభుత్వం తన చర్యను సమర్థించుకుంది.

  • Loading...

More Telugu News