India: వీడిన సందిగ్ధత... బ్రిస్బేన్ టెస్టుకు టీమిండియా ఓకే!

India Ready to Play in Brisbane With Condition
  • బ్రిస్బేన్ లో మ్యాచ్ ఆడుతామన్న బీసీసీఐ
  • ఆపై ఒక్క క్షణం కూడా ఉండబోము
  • వెంటనే ఇండియాకు పంపాలని షరతు
ఆస్ట్రేలియాతో జరగాల్సిన నాలుగో టెస్ట్ పై సందిగ్ధత వీడింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న కారణంగా బ్రిస్బేన్ లో మ్యాచ్ ఆడే విషయమై నిన్నటి వరకూ తన నిర్ణయాన్ని ప్రకటించని బీసీసీఐ, ఎట్టకేలకు ఓ మెట్టు దిగి, మ్యాచ్ ఆడేందుకు అంగీకరించింది. ఇదే సమయంలో మ్యాచ్ ముగిసిన తరువాత ఒక్క రోజు కూడా తమ ఆటగాళ్లు ఆస్ట్రేలియాలో ఉండబోరని, వెంటనే ఇండియాకు వెళ్లే ఏర్పాట్లు చేయాలని షరతు విధించింది.

బ్రిస్బేన్ మ్యాచ్ ముగిసిన తరువాత ఒక్క రాత్రి కూడా అక్కడ నిద్ర చేయబోమని స్పష్టం చేస్తూ, ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు అందుబాటులో ఉండే తొలి విమానంలోనే తమను పంపించి వేయాలని కోరినట్టు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇక టీమిండియా స్వదేశానికి చేరుకున్న తరువాత, ఇంగ్లండ్ జట్టు రానున్న సంగతి తెలిసిందే. అయితే, ఇంగ్లండ్, ఇండియా జట్ల మధ్య జరిగే మ్యాచ్ లకు ప్రేక్షకులను అనుమతించరాదని కూడా నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.

రెండు దేశాల క్రికెటర్లూ కఠినమైన నిబంధనల మధ్య బయో బబుల్ లో ఉండి మ్యాచ్ లు ఆడతారని, అటువంటి పరిస్థితుల్లో వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టేలా రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేమని, అందువల్లే వీక్షకులను అనుమతించ కూడదని నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు.

India
Australia
Cricket
Brisbane

More Telugu News