Vaccine: సిద్ధంగా ఉన్న 7 కోట్ల వ్యాక్సిన్ డోస్ లు... ధర ఖరారు కాకపోవడంతో పంపిణీ ప్రారంభం కాని వైనం!

70 Million Vaccine Doses Ready in India but not Price

  • ధర విషయంలో కేంద్రంతో కుదరని ఒప్పందం
  • ధర తగ్గించాలంటున్న కేంద్రం 
  • ఒక్కో వ్యాక్సిన్ కు రూ. 200 ఆఫర్ చేసిన కేంద్రం  
  • యూకేతో పోలిస్తే సగానికన్నా తక్కువేనంటున్న సీరమ్

పెద్ద దేశాలైన యూఎస్, చైనాలు తమ దేశంలోని ప్రజలకు సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ ఇవ్వాలని పరుగులు పెడుతున్నాయి. అనుమతి పొందిన వ్యాక్సిన్ లను ప్రజలకు పంచుతున్నాయి. ఇక ఇండియా మాత్రం రెండు వ్యాక్సిన్లకు అనుమతినిచ్చిన తరువాత కూడా ఇంకా వ్యాక్సినేషన్ ను ప్రారంభించలేదు. ప్రస్తుతం ఇండియాలో దాదాపు 7 కోట్ల వ్యాక్సిన్ డోస్ లు సిద్ధంగా ఉన్నాయి. అంటే, దాదాపు 3.5 కోట్ల మందికి టీకా ఇవ్వవచ్చు. అయినా ఇంకా పంపిణీకి అనుమతి లభించలేదు.

మిగతా దేశాల్లో అనుమతి లభించిన గంటల వ్యవధిలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైపోయింది. ఆయా వ్యాక్సిన్ సంస్థలతో టీకా ధర నిర్ణయం ఆయా దేశాల్లో మొదటే జరిగిపోయింది. ఇండియాలో మాత్రం వ్యాక్సిన్ కు ధర నిర్ణయించే విషయంలో మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. టీకా తయారీ కంపెనీలు, కేంద్రానికి మధ్య ఇంకా ప్రైసింగ్ అగ్రిమెంట్ కుదరలేదు. కొన్ని నెలలుగా చర్చలు సాగుతున్నా ఇంకా సరఫరా ఒప్పందం కూడా కుదరలేదు.

ముఖ్యంగా ఆక్స్ ఫర్డ్ - ఆస్ట్రాజెనికాలు తయారు చేసిన వ్యాక్సిన్ ను ఇండియాలో పుణె కేంద్రంగా నడుస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. సీరమ్ కు, కేంద్రానికి మధ్య ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు సాగినా, ధర విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోలేకపోవడం గమనార్హం. ఇటీవల మీడియాతో మాట్లాడిన సీరమ్ చీఫ్ అదార్ పూనావాలా, తమకు కేంద్రం నుంచి 10 కోట్ల డోస్ లకు నోటిమాత్రంగా ఆర్డర్ వచ్చిందని, ఒక్కోటి రూ. 200కు (2.74 డాలర్లు) కావాలని అడిగారని వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇదే వ్యాక్సిన్ కు బ్రిటన్ లో 4 నుంచి 5 డాలర్ల వరకూ ధరను ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన గుర్తు చేశారు. అధికారిక డీల్ కుదరగానే, వ్యాక్సిన్ ను కేంద్రానికి ఇస్తామని వెల్లడించారు. ఇక, రూ.1000 ధర మించకుండా వ్యాక్సిన్ లను ప్రైవేటుగా వ్యక్తులకు ఇచ్చేందుకు అనుమతించాలని కోరినట్టు తెలిపారు.

కాగా, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ధరను మరింతగా తగ్గించాలని సీరమ్ పై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఇక ఇండియాలో తయారైన భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఇంకా తుది దశ ట్రయల్స్ కు వాలంటీర్లను నియమించుకుంటున్న సంగతి తెలిసిందే. అయినా భారత్ బయోటెక్ వ్యాక్సిన్ అత్యవసర వాడకానికి కూడా అనుమతి లభించింది. ఇండియాలో కేసులు కోటి దాటిన వేళ, ప్రజా ప్రయోజనాలను పక్కనబెట్టి, ధరలపై నిర్ణయం తీసుకోకుండా జాతి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టడం తగదని విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.

  • Loading...

More Telugu News