Love Jihad: లవ్ జిహాద్ రూమర్లతో పోలీసుల అత్యుత్సాహం... రాత్రంతా పోలీస్ స్టేషన్ లో గడిపిన యువజంట!

Love Jihad rumors in Uttar Pradesh

  • ఉత్తరప్రదేశ్ లో ఘటన
  • సున్నితంగా మారిన లవ్ జిహాద్ అంశం
  • ముస్లిం వ్యక్తి హిందూ అమ్మాయిని పెళ్లాడుతున్నాడంటూ ఫోన్
  • మతమార్పిడి చేస్తున్నాడంటూ పోలీసులకు సమాచారం
  • జంటను స్టేషన్ కు తీసుకువచ్చిన పోలీసులు
  • అమ్మాయి ముస్లిమేనని వెల్లడించిన సోదరుడు

ఉత్తరప్రదేశ్ లో లవ్ జిహాద్ అంశం కొన్నాళ్లుగా తీవ్ర విద్వేషాలకు కారణమవుతోంది. తాజాగా, ఖుషీ నగర్ లో పోలీసులు లవ్ జిహాద్ నేపథ్యంలో ఓ పెళ్లిని ఆపేశారు. ఓ ముస్లిం వ్యక్తి, హిందూ అమ్మాయిని మతమార్పిడి చేసి పెళ్లాడబోతున్నాడంటూ పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది.

దాంతో పోలీసులు హైదర్ అలీ (39) అనే వ్యక్తితో పాటు ఓ అమ్మాయిని కూడా తీసుకువచ్చి కస్యా పోలీస్ స్టేషన్ లో రాత్రంతా ఉంచారు. అయితే, మరునాడు ఆ అమ్మాయి సోదరుడు  వచ్చి పోలీసులతో మాట్లాడడంతో అసలు విషయం వెల్లడైంది. ఆ వ్యక్తితో పాటు యువతి కూడా ముస్లిం అని తెలిసింది.

ఆమె పేరు షబీలా ఖాతూన్ (28). వారిది ప్రేమ వివాహం. హైదర్ అలీకి గతంలో వివాహం కాగా, పదేళ్ల కిందట భార్యను కోల్పోయాడు. క్షురకుడిగా పనిచేసే అలీ... షబీలాతో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఇరువురు పెళ్లి చేసుకుని, అందరికీ పార్టీ ఇస్తుండగా పోలీసులు వచ్చి తమను తీసుకెళ్లారని అలీ ఆరోపించాడు. తనను బెల్టుతో విచక్షణ రహితంగా కొట్టారని వాపోయాడు. పోలీసులు మాత్రం అదేమీలేదని స్పష్టం చేశారు.  

ఇద్దరూ మేజర్లని తెలిసిందని, పైగా ఒకే మతానికి చెందినవారు కావడంతో తామేమీ అభ్యంతరం వ్యక్తం చేయబోమని స్పష్టం చేశారు. షబీలా సోదరుడు మాట్లాడుతూ, తన సోదరికి ఈ పెళ్లి ఇష్టమైతే తమకేమీ ఇబ్బందిలేదని పేర్కొన్నాడు.

Love Jihad
Uttar Pradesh
Romors
Marriage
Police
  • Loading...

More Telugu News