Mumbai Indians: పాండ్య మెరుపుదాడి, కిషన్ విధ్వంసం... ఐపీఎల్ క్వాలిఫయర్-1లో ముంబయి భారీ స్కోరు

Mumbai posted huge total against Delhi Capitals

  • దుబాయ్ లో ముంబయి వర్సెస్ ఢిల్లీ
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 రన్స్ చేసిన ముంబయి
  • 14 బంతుల్లో 37 రన్స్ చేసిన పాండ్యా
  • 30 బంతుల్లో 55 రన్స్ సాధించిన ఇషాన్ కిషన్
  • అశ్విన్ కు 3 వికెట్లు

ముంబయి ఇండియన్స్ కు ఐపీఎల్ లో అంత క్రేజ్ ఎందుకొచ్చిందో ఈ ఇన్నింగ్స్ ద్వారా అర్థమవుతుంది. దుబాయ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో ఐపీఎల్ క్వాలిఫయర్-1లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. ఓ దశలో భారీ స్కోరు కష్టమే అని భావించినా, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ బ్యాట్లు ఝుళిపించడంతో ఆశించిన ఫలితం వచ్చింది.

ముఖ్యంగా పాండ్యా చిచ్చరపిడుగులా చెలరేగాడు. పాండ్యా కేవలం 14 బంతుల్లో 5 భారీ సిక్సులతో 37 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ 30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 55 పరుగులు సాధించాడు. అంతకుముందు ఓపెనర్ క్వింటన్ డికాక్ 25 బంతుల్లో 40, సూర్యకుమార్ యాదవ్ 38 బంతుల్లో 51 పరుగులు నమోదు చేశారు.

కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. అశ్విన్ బౌలింగ్ లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగాడు. పొలార్డ్ పరిస్థితి కూడా ఇంతే. అశ్విన్ బౌలింగ్ లో భారీ షాట్ కొట్టబోయి లాంగాన్ లో రబాడా చేతికి చిక్కాడు. అశ్విన్ కు 3 వికెట్లు లభించగా, ఆన్రిక్ నోక్యా 1, స్టొయినిస్ 1 వికెట్ తీశారు.

కాగా లక్ష్యఛేదనలో ఢిల్లీ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. ముంబయి లెఫ్టార్మ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ధాటికి ఓపెనర్ పృథ్వీ షా, రహానే డకౌట్ అయ్యారు. అప్పటికి స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా లేదు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News