Sobhanaidu: కూచిపూడి నృత్యకళాకారిణి శోభానాయుడు ఇకలేరు!
![Sobha Naidu Passes Away](https://imgd.ap7am.com/thumbnail/cr-tn-a772d6e1584e.jpg)
- నెల రోజుల క్రితం కాలు జారి పడటంతో గాయాలు
- పది రోజుల క్రితం సోకిన కరోనా
- తెల్లవారు జామున కన్నుమూత
ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత శోభానాయుడు ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె వయసు 64 సంవత్సరాలు. దాదాపు నెల రోజుల క్రితం తన ఇంట్లో కాలు జారిపడిన ఆమె తలకు గాయం కాగా, అప్పటి నుంచి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. ఆర్థో న్యూరాలజీ సమస్యతో బాధపడుతున్న ఆమెకు, రెండు వారాల క్రితం కరోనా కూడా సోకినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించి ఆమె కన్నుమూశారు.
విశాఖ జిల్లా అనకాపల్లిలో వెంకటనాయుడు, సరోజినీ దేవి దంపతులకు 1956లో జన్మించిన ఆమె, చిన్నప్పటి నుంచీ వెంపటి చిన సత్యం వద్ద కూచిపూడిని అభ్యసించారు. దేశవిదేశాలలో అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చి పేరుతెచ్చుకున్నారు. ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2001లో ఆమెకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.
![](https://img.ap7am.com/froala-uploads/froala-3bee1c70d129a92f712271d77db7b33661619445.jpg)