Republic TV: కలకలం రేపిన టీఆర్పీ రేటింగ్ స్కామ్ లో రిపబ్లిక్ టీవీ!

Republic TV in Rating Scam

  • వ్యాపార ప్రకటనల ఆదాయాన్ని పెంచుకునేందుకు తప్పుడు మార్గాలు
  • ఇప్పటికే రెండు చానెళ్ల యజమానులను అరెస్ట్ చేసిన పోలీసులు
  • నేడో, రేపో రిపబ్లిక్ టీవీకి నోటీసులు ఇస్తామన్న ముంబై అధికారులు
  • తప్పుడు ఆరోపణలను చేస్తున్నారన్న చానెల్ యాజమాన్యం

తమ టీవీ చానెళ్లలో వ్యాపార ప్రకటనల ద్వారా వచ్చే మొత్తాన్ని పెంచుకునేందుకు రిపబ్లిక్ టీవీ సహా మరో రెండు చానెళ్లు, టీఆర్పీ రేటింగ్ స్కామ్ కు పాల్పడ్డాయని ముంబై పోలీసులు తేల్చారు. తమ మోసపూరిత చర్యలతో, కార్యక్రమాలకు అధిక టీఆర్పీ రేటింగ్ ను చూపించిన వీరు, అడ్వర్టయిజ్ మెంట్లకు అధిక మొత్తాలను వసూలు చేశారని వెల్లడించారు.

ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య, ఆపై ముంబై పోలీసులపై వచ్చిన ఆరోపణల వార్తల విషయంలో ఈ చానెళ్లు అతిగా ప్రవర్తించాయని, తమ కార్యక్రమాలను అత్యధికులు చూస్తున్నారని బయటకు చెబుతూ, అధిక డబ్బులను ప్రకటనకర్తల నుంచి వసూలు చేశారని, ఈ కేసులో ఇప్పటివరకూ ఇద్దరు టీవీ చానెల్ యజమానులను అరెస్ట్ చేశామని తెలిపారు.

కాగా, తమపై వచ్చిన ఆరోపణలపై అర్నాబ్ గోస్వామి నేతృత్వంలోని రిపబ్లిక్ టీవీ స్పందిస్తూ, సుశాంత్ విషయంలో తమ కవరేజ్ తరువాత, చానెల్ ను టార్గెట్ గా చేసుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. సుశాంత్ ఆత్మహత్య తరువాత పోలీసులను తాము ప్రశ్నించడమే తప్పయిపోయిందని చానెల్ ఓ ప్రకటనలో పేర్కొంది. తమను ఇరికించాలని చూస్తున్న ముంబై పోలీసులపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది.

కాగా, ఈ కేసులో ఫక్త్ మరాఠీ, బాక్స్ సినిమా టీవీ చానెల్స్ యజమానులను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత రిపబ్లిక్ టీవీ డైరెక్టర్లు, ప్రమోటర్లను ప్రస్తుతం విచారిస్తున్నామని ముంబై పోలీసు అధికారులు వెల్లడించారు. ఒకటి, రెండు రోజుల్లో రిపబ్లిక్ టీవీ యాజమాన్యానికి నోటీసులు ఇస్తామని, ఈ కేసులో మరిన్ని చానెళ్లను విచారించాల్సి వుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ చానెళ్ల ఆదాయం, వ్యాపార ప్రకటనల ద్వారా వస్తున్న డబ్బు, బ్యాంకు ఖాతాల వివరాలను పరిశీలిస్తామని తెలియజేశారు.

Republic TV
Rating Scam
Mumbai Police
  • Loading...

More Telugu News