Lockdown: 'సెప్టెంబర్ 25 నుంచి మరో లాక్ డౌన్' అంటూ ప్రచారం.. ఫేక్ అని తేల్చిన పీఐబీ!

Another Lockdown is Fake says PIB

  • ఇండియాలో రోజుకు దాదాపు లక్ష కొత్త కేసులు
  • ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించేందుకు లాక్ డౌన్ అంటూ ప్రచారం
  • వైరల్ అవుతున్న సమాచారం వాస్తవం కాదన్న పీఐబీ

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య రోజుకు దాదాపు లక్ష వరకూ వస్తున్న వేళ, వీటికి అడ్డుకట్ట వేస్తూ, ఆసుపత్రులపై ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నెల 25 నుంచి మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ ను కేంద్రం ప్రకటించనుందని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ) సిఫార్సుల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతూ, అఫీషియల్ లెటర్ హెడ్ పై ఉన్నట్టుగా ఓ ఆర్డర్, దానికి సంబంధించిన పోస్ట్ ను ఎంతో మంది షేర్ చేసుకున్నారు.

ఇక దీనిపై భారత అధికార వార్తా సంస్థ పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ఫ్యాక్ట్ చెక్ చేపట్టింది. ఈ నెల 10న ఈ ఆర్డర్ ను ప్రభుత్వం జారీ చేసినట్టుగా ఉన్న స్క్రీన్ షాట్  వైరల్ కాగా, ఇందులో కరోనా కేసులు, మృతులు పెరుగుతున్న దృష్ట్యా, ప్రణాళికా సంఘం, ఎన్డీఎంఏ సిఫార్సుల మేరకు ప్రధాని కార్యాలయం మరో సారి లాక్ డౌన్ కు ఆదేశాలు ఇచ్చిందని, 25 నుంచి 46 రోజుల పాటు ఇది కొనసాగుతుందని ఇందులో కనిపిస్తోంది. అయితే, ఇది తప్పుడు సమాచారమని పీఐబీ స్పష్టం చేసింది.

ఎన్డీఎంఏ నుంచి ఈ తరహా సిఫార్సులేవీ వెళ్లలేదని, ఈ వార్త ఫేక్ అని పీఐబీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో స్పష్టం చేసింది. లాక్ డౌన్ మరోమారు విధించాలంటూ, కేంద్రం కూడా ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని పేర్కొంది.

Lockdown
Fake
PIB
India
Corona Virus
  • Error fetching data: Network response was not ok

More Telugu News