USA: చైనాకు చెందిన 11 కీలక కంపెనీలను టార్గెట్ చేసిన అమెరికా

USA targtes eleven Chinese companies

  • వాణిజ్య ఆంక్షలు విధించిన అమెరికా
  • చైనాలో వీగర్ ముస్లింల అణచివేతపై అమెరికా ఆగ్రహం
  • మానవ హక్కుల ఉల్లంఘన అంటూ వ్యాఖ్యలు

కరోనా పరిస్థితులు ఏర్పడకముందే అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం రాజుకుంది. కరోనా వచ్చిన తర్వాత అది మరింత ముదిరింది. అప్పటినుంచి చైనాకు చెందిన అనేక సంస్థలపై నిషేధం గానీ, ఆంక్షలు గానీ విధిస్తూ అమెరికా కటువుగా వ్యవహరిస్తోంది. తాజాగా చైనాకు చెందిన 11 భారీ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధించింది. అందుకు కారణం, చైనాలోని వీగర్ ముస్లింలపై అక్కడి ప్రభుత్వం అణచివేత ధోరణి ప్రదర్శించడమే! షిన్ జియాంగ్ ప్రావిన్స్ లోని వీగర్ ముస్లింలపై ప్రభుత్వ అణచివేతలో ఈ కంపెనీలకు కూడా పాత్ర ఉందని అమెరికా భావిస్తోంది.

చైనాలో మైనార్టీ వర్గం అయిన వీగర్ ముస్లింలతో బలవంతంగా ఆయా కంపెనీల్లో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని అమెరికా వాణిజ్య విభాగం చెబుతోంది. అంతేకాదు, వీటిలో రెండు కంపెనీలు వీగర్ ముస్లింలపై జన్యుపరమైన అధ్యయనాలు కూడా చేపడుతున్నాయని, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని ఆరోపించింది. ఈ నేపథ్యంలో కఠిన ఆంక్షలు విధిస్తున్నట్టు వెల్లడించింది.

ఇకపై ప్రభుత్వ అనుమతి లేనిదే ఈ చైనా కంపెనీలతో అమెరికా కంపెనీలు ఎలాంటి లావాదేవీలు నిర్వహించడానికి వీలుపడదు. కాగా, తాజాగా ఆంక్షలు విధించిన కంపెనీల జాబితాలో నన్ చాంగ్ ఓ-ఫిల్మ్ టెక్, బీజింగ్ జీనోమ్ ఇన్ స్టిట్యూట్ వంటి సంస్థలు ఉన్నాయి. నన్ చాంగ్ సంస్థ అమెజాన్, ఆపిల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలకు సరఫరాదారు కాగా, బీజింగ్ జీనోమ్ ఇన్ స్టిట్యూట్ కు చైనా ప్రభుత్వంతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు.

USA
China
Companies
Muslims
Donald Trump
  • Loading...

More Telugu News