Narendra Modi: సీఎంలతో ముగిసిన మోదీ వీడియో కాన్ఫరెన్స్‌.. కీలక సూచనలు చేసిన ప్రధాని

PM modi on Lockdown

  • లాక్‌డౌన్‌ ఎత్తి వేయాలని కోరిన ఐదుగురు సీఎంలు
  • వద్దన్న నలుగురు సీఎంలు
  • మన ఆర్థిక వ్యవస్థ బాగుందన్న మోదీ
  • లాక్‌డౌన్‌ను ఎత్తి వేసే విషయంపై ప్రణాళికలు వేసుకోవాలని పిలుపు

లాక్‌డౌన్‌ పొడిగింపు లేక ఎత్తివేత, సడలింపులపై ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మోదీ కీలక విషయాలు ప్రస్తావించారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ సజావుగా ఉందని చెప్పారు. దేశంలో కరోనా విజృంభణ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లోనే లాక్‌డౌన్‌ పొడిగింపు ఉంటుందన్న సంకేతాలు ఇచ్చారు.

'మనదేశ ఆర్థిక వ్యవస్థ గురించి చింతించాల్సిన అవసరం లేదు. మన ఆర్థిక వ్యవస్థ బాగుంది' అని మోదీ వ్యాఖ్యానించారు. మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని లాక్‌డౌన్‌ ఎత్తివేతపై అభిప్రాయం వ్యక్తం చేసిన తొమ్మిది మంది ముఖ్యమంత్రుల్లో ఐదుగురు లాక్‌డౌన్‌ ఎత్తేయాలని అన్నారు. మిగతా నలుగురు మాత్రం కరోనా విజృంభణను కట్టడి చేయాలంటే లాక్‌డౌన్‌ పొడించాలని తెలిపారు.

లాక్‌డౌన్‌ను ఎత్తి వేసే విషయంపై ప్రణాళికలు వేసుకోవాలని రాష్ట్రాలకు ప్రధాని మోదీ సూచించారు. రెడ్, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్ల పరిధిలో లాక్‌డౌన్‌  క్రమంగా ఎలా ఎత్తివేయాలన్న అంశాలపై ఆలోచించాలన్నారు. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సామాజిక దూరం, మాస్కుల వినియోగం నిబంధనలను పాటిస్తూ వాణిజ్య కార్యకలాపాలు జరపాలని చెప్పారు.  కేంద్రం నుంచి ఆర్థిక ప్యాకేజీ అందాలని రాష్ట్రాలు కోరాయి. విద్యా సంస్థలు, రవాణ, ప్రార్థనాలయాలు వంటి వాటిపై ఆంక్షలను మాత్రం కొనసాగించాల్సిందేనని సమావేశంలో అందరూ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News