Hanamkonda: బిర్యానీ బిల్లు చెల్లించే విషయంలో ఘర్షణ.. దాడిలో స్నేహితుడి మృతి

  • రెండేళ్ల క్రితమే ప్రేమ పెళ్లి చేసుకున్న అభిలాశ్
  • ఏడాది క్రితమే బతుకు దెరువు కోసం నగరానికి
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

బిర్యానీ బిల్లు కట్టే విషయంలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ పరస్పరం దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ ఘటనలో ఓ యువకుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ ప్రాంతంలోజరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లాలోని హన్మకొండకు చెందిన అభిలాశ్ (28) రెండేళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఏడాది క్రితం ముషీరాబాద్ వచ్చి వైఎస్సార్ పార్క్ సమీపంలో నివసిస్తున్నాడు. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న అభిలాశ్‌కు అదే కాలనీకి చెందిన వంశీ, చందు, హరీశ్‌లతో పరిచయం ఏర్పడింది.

ఈ నెల 24న రాత్రి మిత్రులందరూ కలిసి మద్యం తాగారు. అనంతరం నారాయణగూడ వెళ్లి బిర్యానీ  తిన్నాక బిల్లు చెల్లించే విషయంలో వారి మధ్య గొడవ జరిగింది. అనంతరం అందరూ కలిసి తిరిగి వైఎస్సార్ పార్క్ వద్దకు చేరుకున్నారు. బిల్లు విషయమై అక్కడ మరోమారు వారి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో అభిలాశ్‌ను వంశీ బలంగా నెట్టడంతో అతడు పక్కనే ఉన్న రాయిపై పడ్డాడు. తలకు తీవ్ర గాయమై రక్తమోడుతున్న అతడిని వెంటనే యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

  • Loading...

More Telugu News