Hyderabad: వివాహేతర సంబంధం కొనసాగించాలని వేధింపులు.. నిరాకరించిన మహిళపై కత్తితో దాడి

  • భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తున్న మహిళ
  • గత పరిచయాన్ని అడ్డం పెట్టుకుని వేధిస్తున్న నిందితుడు
  • కల్లు గీసే కత్తితో దాడి

వివాహేతర సంబంధం కొనసాగించేందుకు నిరాకరించిన మహిళపై ఓ వ్యక్తి కత్తితో దాడిచేశాడు. హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి చెందిన మహిళ భర్త చనిపోవడంతో మన్సూరాబాద్ డివిజన్‌లో ఒంటరిగా నివసిస్తోంది. అదే మండలానికి చెందిన నారంబాబు గౌడ్ ఆమెతో గతంలో ఉన్న పరిచయాన్ని అడ్డంపెట్టుకుని తనతో వివాహేతర సంబంధం కొనసాగించాలని ఒత్తిడి తీసుకొస్తున్నాడు.

అతడి వేధింపులు రోజురోజుకు ఎక్కువ అవుతుండడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని జైలుకు పంపారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన నారంబాబు పెద్దమనుషుల సమక్షంలో ఆమె వెంటపడనని హామీ ఇచ్చాడు. అయినప్పటికీ తీరు మార్చుకోని నిందితుడు ఈ నెల 18న మరోమారు బాధితురాలి ఇంటికి వెళ్లి వేధించాడు. వివాహేతర సంబంధానికి ఆమె నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు వెంట తెచ్చుకున్న కల్లుగీసే కత్తితో ఆమెపై దాడిచేశాడు.

దీంతో షాక్‌కు గురైన బాధితురాలు అరవడంతో అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, బాధితురాలు తనకు మూడు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉందని, అడగడానికి వెళ్తే దుర్భాషలాడిందని, అందుకే ఆమెపై దాడిచేశానని నిందితుడు తెలిపాడు.

  • Loading...

More Telugu News