Budda Venkanna: మీరసలు నోటికి అన్నమే తింటున్నారా?: విజయసాయిరెడ్డిపై బుద్ధా ఫైర్

  • ట్విట్టర్ లో బుద్ధా వ్యాఖ్యలు
  • విజయసాయిరెడ్డికి ప్రశ్నాస్త్రాలు
  • కార్మికుల ఆత్మహత్యలకు వ్యక్తిగత కారణాలు ఆపాదిస్తారా? అంటూ ఆగ్రహం

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. "ఉపాధి లేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వ్యక్తిగత కారణాలతో చనిపోతున్నారని ఎగతాళి చేస్తారా? మీరసలు నోటికి అన్నమే తింటున్నారా?" అంటూ  ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

"విపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయని మీ ముఖ్యమంత్రి అంటున్నారు. చేతగాని నిర్ణయాలతో 40 మంది భవన నిర్మాణ కార్మికులను పొట్టనబెట్టుకున్నది కాకుండా ఇంత సిగ్గులేకుండా ఎలా మాట్లాడుతున్నారు విజయసాయిరెడ్డి గారూ. భవన నిర్మాణ రంగ కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలు కాకపోతే వారికి రూ.5 లక్షల పరిహారం ఎందుకు ప్రకటించినట్టు? వలంటీర్లు అందరూ వైసీపీ వాళ్లే అని ధైర్యంగా చెప్పిన మీరు, వరదల కారణంగానే ఇసుక లేదు అని అబద్ధాలెందుకు చెబుతున్నారు? సిమెంట్ కంపెనీలతో జగన్ గారికి ఇంకా బేరం కుదరలేదని చెప్పండి" అంటూ విమర్శించారు.

"కడుపు నిండిన రైతులకు రుణమాఫీ ఎందుకు? రుణమాఫీ సాధ్యం కాదు, అవసరంలేదు అని రైతులను కించపరుస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలను మర్చిపోయి మీరు రైతుల గురించి మాట్లాడుతున్నారు. రైతుల గురించి మాట్లాడే హక్కు వైసీపీ నేతలకు లేదు" అంటూ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News