Jagan: జగన్ తో లంచ్ మీటింగ్ కోసం విజయవాడ చేరుకున్న చిరంజీవి!

  • నేడు జగన్ తో చిరంజీవి భేటీ
  • మధ్యాహ్న భోజనం కలిసే..
  • భేటీ మర్యాద పూర్వకమేనన్న ఇరు వర్గాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి నేటి మధ్యాహ్నం భేటీ కానున్నారు. వీరిద్దరూ మధ్యాహ్న భోజనాన్ని కలిసే చేస్తారని తెలుస్తోంది. ఈ కలయిక మర్యాద పూర్వకమేనని, ఎటువంటి రాజకీయ కారణాలు లేవని అటు సీఎంఓ అధికారులు, ఇటు చిరంజీవి సన్నిహితులు చెబుతున్నప్పటికీ, రాజకీయ వర్గాల్లో మాత్రం జోరుగా చర్చ జరుగుతోంది. తాను నటించిన 'సైరా' చిత్రాన్ని వీక్షించాలని జగన్ ను కోరేందుకే చిరంజీవి వస్తున్నారని ఆయన సన్నిహితులు వెల్లడించారు.

కాగా, జగన్ ముఖ్యమంత్రి కావడం టాలీవుడ్ నటీ నటులకు ఇష్టం లేదని, అందుకే ఆయన్ను ఎవరూ కలవలేదని ఇటీవలి కాలంలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కొందరు ప్రముఖులకు జగన్ అంటే ఇష్టం లేదని నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి లంచ్ మీటింగ్ ఆసక్తికరంగా మారింది. ఇక జగన్ ను కలిసే నిమిత్తం చిరంజీవి ఇప్పటికే విజయవాడకు చేరుకోగా, ఆయనకు ఫ్యాన్స్ తో పాటు జనసేన కార్యకర్తల నుంచి స్వాగతం లభించింది.

  • Loading...

More Telugu News