Chittoor District: చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతున్న పరువు హత్య.. కుమార్తెను ఇంటికి తీసుకొచ్చిన రోజే దారుణం

  • ప్రేమించిన యువకుడితో వెళ్లిపోయిన బాలిక
  • కుప్పంలో పెళ్లి చేసుకున్న కుమార్తెను ఇంటికి తీసుకొచ్చిన తండ్రి
  • కుమార్తె మృతదేహాన్ని రాత్రికి రాత్రే కాల్చి బూడిదను చెరువులో కలిపిన వైనం

చిత్తూరు జిల్లాలో ఓ బాలిక మృతి కలకలం రేపుతోంది. ఇది ముమ్మాటికీ పరువు హత్యేనన్న వార్తలు వినిపిస్తున్నాయి. తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా మూడు రోజుల క్రితం ఓ దళిత యువకుడిని పెళ్లాడిన బాలిక మృతి చెందడం, ఆపై ఆమె మృతదేహాన్ని కాల్చి బూడిద చేసి, దానిని బస్తాల్లో నింపి మాయం చేయడం చూస్తుంటే బాలిక మృతిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పరువు హత్యేనని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి.

పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని రెడ్లపల్లెకు చెందిన వెంకటేశ్, అమరావతి దంపతుల కుమార్తె చందన (17) డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. పొరుగు గ్రామమైన ఒడ్డుమడికి చెందిన ప్రభు (19)తో ప్రేమలో పడింది. విషయం తెలిసిన చందన తల్లిదండ్రులు కుమార్తెను మందలించారు. దీంతో ఈ నెల 10న ప్రభుతో కలిసి చందన వెళ్లిపోయింది. 11న ఇద్దరూ కుప్పంలో వివాహం చేసుకున్నారు. విషయం తెలిసిన చందన తండ్రి శనివారం వారిని పట్టుకుని కుమార్తెను ఇంటికి తీసుకెళ్లాడు.

అయితే, ఆదివారం ఉదయం చందన ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందింది. దళితుడిని పెళ్లాడిన కుమార్తెను తల్లిదండ్రులు చంపేశారన్న వార్త విస్తృతంగా ప్రచారం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, రాత్రికి రాత్రే కుమార్తె మృతదేహాన్ని తల్లిదండ్రులు కాల్చి బూడిద చేశారు. అనంతరం బూడిదను కర్ణాటక సరిహద్దులోని చెరువులో కలిపేశారు.

మరోవైపు, ఘటన జరిగిన తర్వాత ప్రభు, అతడి తండ్రి శ్రీనివాసరావు అదృశ్యమయ్యారు. యువకుడి తల్లి పద్మమ్మ మాట్లాడుతూ.. కులాంతర వివాహం చేసుకుందన్న అక్కసుతోనే చందనను తల్లిదండ్రులు హత్య చేశారని ఆరోపించింది. తన భర్త, కుమారుడిని కూడా వారు ఏదో చేసి ఉంటారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, చందన మృతదేహానికి సంబంధించిన కొంత బూడిదను కర్ణాటకలోని కేశంబల్ల చెరువు ఒడ్డున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News