KCR: దసరాకు మొదలైన సెలవులు సంక్రాంతి వరకు కొనసాగుతాయేమో!: కేసీఆర్ సర్కారుపై విజయశాంతి సెటైర్

  • తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
  • కేసీఆర్ పై విమర్శలు చేసిన విజయశాంతి
  • ప్రజల ప్రాణత్యాగాలను స్వార్థం కోసం వాడుకుంటాడని వ్యాఖ్యలు

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె, కార్మికుల పట్ల కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తున్న తీరు పట్ల కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెబుతున్న ప్రభుత్వం స్కూళ్లకు ఎందుకు సెలవులు పొడిగించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ సర్కారు తీరు చూస్తుంటే సమ్మె ముగిసేవరకు ఇలా సెలవులు పొడిగించుకుంటూ పోతారేమో అనిపిస్తోందని తెలిపారు. దసరాకు మొదలైన సెలవులు సంక్రాంతి వరకు కొనసాగించేట్టుందని ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పైనా విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీకాంతాచారి తరహాలో ఆత్మత్యాగానికి పాల్పడితే ప్రభుత్వం దిగొస్తుందని ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి బలవన్మరణానికి పాల్పడడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రజల ప్రాణత్యాగాలను తన స్వార్థం కోసం వాడుకోవడం కేసీఆర్ దొరగారికి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఇలాంటి ప్రాణత్యాగాలు చూసి చలించే మనస్తత్వం కేసీఆర్ ది కాదని పేర్కొన్నారు. ఏదైనా బతికి సాధించాలని, కేసీఆర్ దొరతనానికి అంతం చూడాలంటే అదే మార్గమని తెలిపారు.

  • Loading...

More Telugu News