Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ నెల 30న అపాయింట్ మెంట్ ఆర్డర్లు

  • సీఎం జగన్ చేతులమీదుగా అపాయింట్ మెంట్ ఆర్డర్లు
  • అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయాలు ప్రారంభం
  • మున్ముందు మరిన్ని సేవలు అందిస్తామన్న సర్కారు

వైసీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల సాయంతో పరిపాలన నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఉద్యోగుల కోసం నియామక ప్రక్రియ కూడా పూర్తయింది. కొన్నిరోజుల క్రితమే పరీక్ష ఫలితాలు వెల్లడి కావడం, మెరిట్ లిస్టు విడుదల చేయడం జరిగింది. దీనిపై మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ విజయ్ కుమార్ మాట్లాడారు. ఈ నెల 30న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇస్తున్నట్టు వెల్లడించారు. సీఎం జగన్ చేతులమీదుగా అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నట్టు తెలిపారు.

గ్రామ, వార్డు సచివాలయాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఇకపై ప్రజాపాలన స్థానిక సచివాలయాల ద్వారానే అందిస్తామని చెప్పారు. అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయాల్లో పౌరసేవలు ప్రారంభమవుతాయని, 72 గంటల్లో పూర్తయ్యేలా 10 సేవలను అందుబాటులోకి తెస్తున్నామని, ఆ తర్వాత సేవలను మరింత పెంచుకుంటూ పోతామని విజయ్ కుమార్ వివరించారు.

పట్టణాల్లో ప్లాన్, బిల్డింగ్ అనుమతులు మూడ్రోజుల్లోనే ఇస్తామని, డెత్, బర్త్ సర్టిఫికెట్ నమూనాలను వెంటనే ఇచ్చేస్తామని తెలిపారు. వార్డు సచివాలయాల్లో ప్రతిరోజూ స్పందన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతు భరోసా, పెన్షన్లు వంటి పథకాలను గ్రామ సచివాలయాల ద్వారానే అమలు చేస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News