Tamil Nadu: భార్యను పంపకుంటే బాంబులతో పేల్చేసుకుంటా: నాటు బాంబుల దండతో వ్యక్తి హల్‌చల్

  • భర్తతో విభేదాల కారణంగా ఏడాదిగా పుట్టింటిలో ఉంటున్న భార్య
  • మెడలో బాంబుల దండ, చేతిలో పెట్రోలు క్యానుతో భర్త ప్రత్యక్షం
  • అప్పటికే విషం తాగాననడంతో ఆసుపత్రికి తరలింపు

విభేదాల కారణంగా ఏడాదిగా పుట్టింటిలో ఉంటున్న భార్యను తిరిగి ఇంటికి రప్పించేందుకు ఓ భర్త చేసిన నిర్వాకం అందరినీ హడలెత్తించింది. భార్యను తనతో పంపకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ మెడలో నాటు బాంబుల దండతో ప్రత్యక్షమైన భర్తను చూసిన భార్య, ఆమె తల్లిదండ్రులు భయంతో వణికిపోయారు. చివరికి పోలీసుల రంగప్రవేశంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడులోని కడలూరు జిల్లా నైవేలీకి చెందిన మణికంఠన్‌కు భార్యతో విభేదాలు పొడసూపాయి. దీంతో ఆమె తన కుమారుడిని తీసుకుని ఏడాది క్రితం పుట్టింటికి చేరుకుంది. భర్త నుంచి విడాకులు ఇప్పించాలంటూ కోర్టుకెక్కింది. ఈ కేసు ఇంకా పెండింగులోనే ఉంది.

తాజాగా, ఆదివారం మెడలో బాంబుల దండ వేసుకుని, చేతిలో పెట్రోలు క్యాను పట్టుకుని మణికంఠన్ భార్య ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె తల్లిదండ్రులతో వాగ్వివాదానికి దిగాడు. భార్యను వెంటనే తనతో పంపాలని, లేదంటే బాంబులు పేల్చి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో వారు షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆత్మహత్య చేసుకుంటే రెండేళ్ల కుమారుడి భవితవ్యం ఏమవుతుందో ఆలోచించాలని హితవు పలుకుతూ అతడి మెడలోని బాంబులను చాకచక్యంగా తొలగించి పెట్రోలు క్యానును లాక్కున్నారు. అయితే, అప్పటికే తాను విషం తాగినట్టు చెప్పడంతో మణికంఠన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News