India: లడఖ్ లో హైటెన్షన్.. భారత్-చైనా సైనికుల మధ్య స్వల్ప ఘర్షణ!

  • పాంగాంగ్ సరస్సు వద్ద ఆర్మీ పెట్రోలింగ్
  • అభ్యంతరం వ్యక్తం చేసిన చైనా బలగాలు
  • ఒకరినొకరు తోసుకున్న ఇండియా-చైనా ఆర్మీ

 పొరుగు దేశం చైనా మరోసారి భారత సైనికులను రెచ్చగొట్టేలా వ్యవహరించింది. దీంతో సరిహద్దులో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఇరువర్గాల సైనికులు ఒకరిని మరొకరు తోసుకున్నారు. అంతలోనే ఉన్నతాధికారులు స్పందించడంతో ఈ ఘర్షణాత్మక వాతావరణం కాస్తా సద్దుమణిగింది. ఈ ఘటన కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ లో చోటుచేసుకుంది.

లడఖ్ లోని పాంగాంగ్ సరస్సు వద్ద భారత బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. త్వరలోనే ఇక్కడ భారత ఆర్మీ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు జరపనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. అయితే భారత ఆర్మీ పెట్రోలింగ్ పట్ల చైనా సైనికులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. భారత్, చైనా సైనికులు ఈ సందర్భంగా ఒకరినొకరు తోసుకున్నారు. అయితే ఇరుదేశాలకు సంబంధించి బ్రిగేడియర్ స్థాయి ఆర్మీ ఉన్నతాధికారులు ఈ విషయమై చర్చలు జరపడంతో సమస్య ఒక్కరోజులోనే పరిష్కారమైంది.

లడఖ్-టిబెట్ మధ్య ఉన్న పాంగాంగ్ సరస్సు తమదంటే, తమదని భారత్-చైనాలు పట్టుబడుతున్నాయి. ఇరుదేశాల మధ్య సరైన సరిహద్దు లేకపోవడం, ప్రస్తుతం ఉన్న వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను చైనా గుర్తించకపోవడంతో భారత్-చైనా సైన్యాల మధ్య తరచూ ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి.

  • Loading...

More Telugu News