Chandrababu: నేరాలను ప్రోత్సహించవద్దని సీఎం జగన్ ను హెచ్చరిస్తున్నా... అవసరమైతే పల్నాడు వెళ్లి నేనే ఉంటా: చంద్రబాబు
- అమరావతిలో పార్టీ నేతలు, కార్యకర్తలను కలిసిన చంద్రబాబు
- పల్నాడు ప్రాంతంలో దాడులపై ఆగ్రహం
- దుశ్చర్యలకు మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరికలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇవాళ అమరావతిలో పార్టీ నేతలు, కార్యకర్తలను కలిశారు. ఈ సందర్భంగా పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న దాడులపై నేతలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. నేతలు, కార్యకర్తలు చెప్పింది విని చంద్రబాబు ఆగ్రహానికి గురయ్యారు. నేరాలను ప్రోత్సహించవద్దని సీఎం జగన్ ను హెచ్చరిస్తున్నానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'పోలీసులతో ఏదైనా చేయొచ్చని సీఎం భావిస్తున్నారు. ఈ దుశ్చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు' అంటూ మండిపడ్డారు.
గురజాల, నరసరావుపేట, మాచర్ల ప్రాంతాల్లో అరాచకాలు పెరుగుతున్నాయని, కట్టడి చేయాల్సిన పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 'అవసరమైతే పల్నాడు ప్రాంతానికి వెళ్లి నేనే ఉంటా' అంటూ కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఈ నెల 30న పల్నాడు నేతలందరితో సమావేశం నిర్వహిస్తానని చంద్రబాబు తెలిపారు.