Telangana: ఆదర్శ రాజకీయవేత్త జైపాల్ రెడ్డి: పవనకల్యాణ్

  • రాజకీయ మేధావి, రాజనీతిజ్ఞుడు జైపాల్ రెడ్డి
  • జైపాల్ మృతి దేశానికి, తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు
  • అంజలి ఘటిస్తూ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌ రెడ్డి మృతిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయ మేధావి, రాజనీతిజ్ఞుడు జైపాల్ రెడ్డి మరణం దేశానికి, తెలుగు రాష్ట్రాలకు తీరని లోటుగా అభివర్ణించారు. తెలంగాణ ముద్దు బిడ్డ జైపాల్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఎంతో సంక్లిష్టమైందని, తెలుగుతో పాటు ఆంగ్లభాషలో ఆయనకు ఉన్న ప్రావీణ్యం వల్ల చట్ట సభలలో ఆయన ప్రసంగాలు ఆకట్టుకునే విధంగా ఉండేవని కొనియాడారు. నాలుగు సార్లు శాసనసభకు, అయిదుసార్లు పార్లమెంటుకు జైపాల్ ఎన్నికయ్యారని, ఉత్తమ పార్లమెంటేరియన్ గా అవార్డు పొందడం తెలుగు జాతి గర్వించదగ్గ విషయమని అన్నారు.

రెండుసార్లు కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన జైపాల్ నిష్కళంకుడిగా పేరు గాంచారని, దేశానికి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, నేటి తరం రాజకీయ వేత్తలకు, యువకులకు ఆయన జీవితం ఆదర్శప్రాయమని అన్నారు. జైపాల్ రెడ్డికి అంజలి ఘటిస్తూ తన తరపున, జనసేన పార్టీ తరపున ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు.

  • Loading...

More Telugu News