Andhra Pradesh: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. 10:30 గంటలకు శాసనసభలోని సీఎం చాంబర్లోకి జగన్

  • ఐదు రోజులపాటు జరగనున్న సమావేశాలు
  • తొలుత జగన్, ఆ తర్వాత చంద్రబాబు ప్రమాణ స్వీకారం
  • శుక్రవారం గవర్నర్ ప్రసంగం

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజులపాటు సమావేశాలు జరగనుండగా, నేటి ఉదయం 11 గంటలకు తొలి సమావేశం ప్రారంభం అవుతుంది. ఆ వెంటనే ప్రొటెం స్పీకర్ శంబంగి చిన వెంకట అప్పలనాయుడు శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తొలుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంటుంది. అనంతరం మిగతా సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. రేపు స్పీకర్ ఎన్నిక ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 15, 16 తేదీల్లో సభకు విరామం కాగా, 17,18 తేదీల్లో తిరిగి సమావేశాలు కొనసాగనున్నాయి. ఆ రెండు రోజులు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. అనంతరం సభ వాయిదా పడుతుంది. తిరిగి జూలైలో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి.  

ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఉదయం 10:30 గంటలకు శాసనసభలోని తన చాంబర్‌లో అడుగుపెడతారు. వేదపండితుల పూజా కార్యక్రమాల అనంతరం తన సీట్లో కూర్చుంటారు. 11:05 గంటలకు శాసనసభలో అడుగుపెడతారు. ప్రస్తుత అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం 151 కాగా, తెలుగుదేశం పార్టీకి 23 మంది, జనసేనకు ఒక ఎమ్మెల్యే వున్నారు. 

  • Loading...

More Telugu News