Maharashtra: ప్రియుడ్ని పెళ్లాడేందుకు భర్త సంతకాన్ని ఫోర్జరీ చేసిన యువతి!

  • ప్రియుడి మోజులో భర్తను వదిలించుకునేందుకు ఎత్తుగడ
  • భర్త విదేశానికి వెళ్లగానే పాత ప్రియుడితో రొమాన్స్
  • పరారీలో థానే యువతి

వివాహేతర సంబంధాల మోజులో ఓ యువతి తన భర్తనే నిలువునా వంచించిన వైనం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని థానే నగరానికి చెందిన నీలోఫర్ అనే యువతి తన ప్రియుడ్ని పెళ్లి చేసుకోవడం కోసం భర్త సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ విడాకుల పత్రాలను సృష్టించింది. ఆమె భర్త యూసుఫ్ షరీఫ్ మస్తాన్ బతుకుదెరువు కోసం యూఏఈ వెళ్లగా, తొమ్మిదేళ్ల కొడుకుతో కలిసి నీలోఫర్ థానేలోని ముంబ్రా ప్రాంతంలో నివసిస్తోంది. 2007 నుంచి ఆమె భర్త మస్తాన్ యూఏఈలో మెకానిక్ గా పనిచేస్తున్నాడు.

భర్త ఇంటి వద్ద లేకపోవడంతో నీలోఫర్ తన పాత ప్రియుడితో సంబంధాలను పునరుద్ధరించింది. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో భర్త తనకు విడాకులు ఇచ్చినట్టు అతని సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ విడాకుల డాక్యుమెంట్ సృష్టించడమే కాకుండా, భర్త కొనుగోలు చేసి తన పేరిట రాసిన ఓ ఇంటిని రూ.23 లక్షలకు అమ్మేసి సొమ్ముచేసుకుంది.

మధ్యలో భారత్ వచ్చినప్పుడు మస్తాన్ తన భార్య ప్రవర్తనలో మార్పు గమనించాడు. ఎప్పుడూ ఫోన్ లో మాట్లాడుతుండడంతో నిలదీయగా, తన ఫ్రెండ్ అని బుకాయించింది. 2017లో మరోసారి భారత్ రాగా, భర్తను కలిసేందుకు నీలోఫర్ నిరాకరించడమే కాకుండా అతడిని ఇంట్లోకి కూడా అడుగుపెట్టనీయలేదు. దాంతో అక్కడే ఓ లాడ్జీలో బస చేసి అసలు విషయం ఏంటని ఆరా తీస్తే భార్య భాగోతం బట్టబయలైంది.

అనంతరం, యూఏఈ వెళ్లిపోయి మళ్లీ స్వదేశానికి వచ్చిన మస్తాన్ కు భార్య ఈసారి విడాకుల పత్రాలు చూపించింది. వాటిపై ఉన్న సంతకం ఫోర్జరీ అని వెంటనే గ్రహించిన ఆ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై అరెస్ట్ వారంట్ జారీ అయింది. దాంతో పరారైన నీలోఫర్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా థానే కోర్టు తిరస్కరించింది. దాంతో ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో దోషిగా తేలితే నీలోఫర్ కు ఏడేళ్ల జైలు శిక్ష పడొచ్చని పోలీసులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News