Cricket: కేవలం 9 మ్యాచ్ లు ఆడి వరల్డ్ కప్ జాక్ పాట్ కొట్టిన విజయ్ శంకర్

  • గతకొద్దికాలంగా రాణిస్తున్న తమిళ తంబి
  • బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో ప్రతిభ
  • కెప్టెన్ కోహ్లీ మద్దతు పుష్కలం

ఐసీసీ వరల్డ్ కప్ లో పాల్గొనే భారత జట్టులో తమిళనాడు క్రికెటర్ విజయ్ శంకర్ స్థానం సంపాదించుకున్నాడు. ఇంగ్లాండ్ వేదికగా జరిగే ఈ భారీ టోర్నమెంట్ లో ఆడే టీమిండియాను నేడు ఎంపిక చేశారు. తుది 15 మందిలో విజయ్ శంకర్ కూడా ఉన్నాడు. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమై వరల్డ్ కప్ టీమ్ ను ఎంపిక చేసింది. ఇక, తాను ప్రపంచ కప్ లో ఆడే భారత జట్టుకు ఎంపికయ్యానని తెలియగానే విజయ్ శంకర్ ఆనందం అంతాఇంతా కాదు.

తాను ఎంపిక అవుతానన్న విషయంపై నమ్మకం ఉన్నా, టీవీలో తన పేరు చూసుకోగానే సంతోషం పట్టలేకపోయానని తెలిపాడు. ప్రస్తుతం విజయ్ శంకర్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ జట్టుకు ఆడుతున్నాడు. మీడియాతో మాట్లాడుతూ, నేటితో తన కల నెరవేరినట్టయిందని అన్నాడు. వరల్డ్ కప్ లో తాను కూడా ఆడుతున్నానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానంటూ వ్యాఖ్యానించాడు. కోహ్లీ కెప్టెన్సీలో ఆడనుండడం మరింత ఉత్సాహాన్నిస్తోందని, సామర్థ్యం మేర రాణించడానికి ప్రయత్నిస్తానని విజయ్ శంకర్ తెలిపాడు.

28 ఏళ్ల విజయ్ శంకర్ ఇప్పటివరకు ఆడింది 9 వన్డేలే అయినా, మంచి ఫినిషర్ గా గుర్తింపు పొందాడు. దానికితోడు బౌలింగ్ లోనూ ఉపయుక్తంగా ఉంటాడన్న ఉద్దేశంతో ఆల్ రౌండర్ కోటాలో విజయ్ శంకర్ ను ఎంపిక చేశారు టీమిండియా సెలక్టర్లు. మరోవైపు, కొంతకాలంగా చర్చనీయాంశంగా ఉన్న నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే సత్తా విజయ్ శంకర్ లో పుష్కలంగా ఉందని టీమిండియా మేనేజ్ మెంట్ భావిస్తోంది.

  • Loading...

More Telugu News