YSRCP: పోలీసులను వాడుకోవడంలో చంద్రబాబు తారస్థాయికి చేరారు: వైసీపీ నేత పెద్దిరెడ్డి ధ్వజం

  • దాడులు చేసింది టీడీపీ వాళ్లే
  • ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తోందీ మీరే
  • అధికారంలో లేని మేమెలా ఖూనీ చేస్తాం?

రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలపై సీఎం చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను వైసీపీ దీటుగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. ఈవీఎంల మొరాయింపు, హింసాత్మక ఘటనలపై వైసీపీని తప్పుబడుతూ చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తుండడం పట్ల వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో వరుసగా మీడియా సమావేశాలతో సీఎం వ్యాఖ్యల పట్ల ఘాటుగా స్పందిస్తున్నారు. తిరుపతిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి విమర్శలు కురిపించారు.

పోలింగ్ సందర్భంగా దాడులకు పాల్పడింది టీడీపీ వర్గీయులేనని, చంద్రబాబు మళ్లీ ఫ్యాక్షన్ ను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తాడిపత్రిలో హత్య కాకుండా, జమ్మలమడుగు, రాజంపేట, ప్రొద్దుటూరు, ఆళ్లగడ్డ, రాప్తాడు వంటి ప్రాంతాల్లో బరితెగించి దాడులకు పాల్పడ్డారని పెద్దిరెడ్డి వివరించారు. రాయలసీమ రతనాలసీమ అని చెబుతూనే ఫ్యాక్షన్ దాడులు చేయిస్తున్నారంటూ విమర్శించారు. ఈ ప్రాంతాల్లో తెలుగుదేశం అభ్యర్థులంతా ఫ్యాక్షనిస్టులేనని ఆరోపించారు. వాళ్లందరినీ పెంచిపోషిస్తున్నాడంటే మళ్లీ రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని పురిగొల్పడమేనని అన్నారు.

"చేసేవన్నీ చేసి మేమేదో ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేశామని చెబుతున్నారు. కానీ ఐదేళ్లుగా అధికారంలో ఉంటూ ఎంతమంది వైసీపీ నాయకుల్ని చంపారో, ఎంతమంది కార్యకర్తల ప్రాణాలు తీశారో, ఎంతమంది మీద అన్యాయంగా ఎస్సీఎస్టీ కేసులు పెట్టారో చూస్తే పోలీసులను తారస్థాయిలో వాడుకుంటున్నట్టు అర్థమవుతుంది. ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. అధికారంలో లేని మేమెలా ఖూనీ చేస్తాం? అధికారాన్ని అడ్డంపెట్టుకుని తప్పుడు కేసులు బనాయిస్తూ, గూండాయిజం చేస్తున్నారు" అంటూ విమర్శలు చేశారు.

  • Loading...

More Telugu News