Lakshmi Parvathi: చంద్రబాబు ఒంటిపై ఎన్ని మచ్చలు ఉన్నాయో అన్ని నీచ రాజకీయాలు చేశాడు: లక్ష్మీపార్వతి ఫైర్

  • ఎన్నికల తర్వాత సింగపూర్ పారిపోవాల్సిందే
  • చంద్రబాబుకు మతిమరుపు వ్యాధి వచ్చింది
  • చంద్రబాబుకు, జగన్ కు చాలా తేడా ఉంది

వైసీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి ఏపీ సీఎం చంద్రబాబునాయుడ్ని లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. స్వయంగా పిల్లనిచ్చి పెళ్లిచేసిన ఎన్టీరామారావుకు వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని అన్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా లక్ష్మీపార్వతి ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఒంటిపై ఎన్ని మచ్చలు ఉన్నాయో అన్ని నీచ రాజకీయాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. చంద్రబాబు గురించి చెప్పాలంటే ఈ అత్తే అందుకు సరైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు.

జగన్ సొంతగా పార్టీ పెట్టి నడిపిస్తుంటే, చంద్రబాబు వెన్నుపోటుతో సంపాదించుకున్న పార్టీని నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆఖరికి ప్రజల కోసం పోరాడుతున్న జగన్ పై హత్యాయత్నం కూడా చేయించాడంటూ లక్ష్మీపార్వతి మండిపడ్డారు. మతిమరుపు వ్యాధి కారణంగా చంద్రబాబు ఇచ్చిన హామీలు మర్చిపోతుంటాడని, ఎన్నికలయిన తర్వాత తానేం చెప్పాడో గుర్తుండదని వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేశ్ సింగపూర్ పారిపోక తప్పదని జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News