Chandrababu: నరేంద్ర మోదీకి సవాల్ విసిరిన చంద్రబాబు

  • మీరేం చేశారో నేనేం చేశానో చర్చిద్దాం
  • సిగ్గులేని కోడికత్తి పార్టీ వత్తాసు పలుకుతోంది
  • ఏమీ చెయ్యకపోయినా చేసినట్టు చెబుతున్నారు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తూర్పుగోదావరి జిల్లా తునిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఐదేళ్ల పాలనలో మీరేం చేశారో, నేనేం చేశానో చర్చిద్దాం దమ్ముంటే రండి అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రానికి మోదీ చేసింది ఏమీలేదని, విశాఖకు రైల్వే జోన్ ఇచ్చినా అది తల లేని మొండెంతో సమానం అని వ్యాఖ్యానించారు. రైల్వే ఆదాయం అంతా రాయ్ గఢ్ కు వెళుతుందని, విశాఖకు రైల్వే జోన్ ఉన్నా ప్రయోజనం లేని పరిస్థితి సృష్టించారని మోదీపై మండిపడ్డారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా ఇవ్వలేదని, పోలవరానికి నిధులు ఇవ్వలేదని అన్నారు. అన్ని విధాలా రాష్ట్రప్రజలను మోసం చేసిన వ్యక్తి నరేంద్ర మోదీ అని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి కియా మోటార్స్ రాకుండా మోదీ విశ్వప్రయత్నాలు చేశారని, గుజరాత్ కు గద్దలాగా తన్నుకుపోవాలని చూశాడని ఆరోపించారు. ఇప్పుడు కోడికత్తి పార్టీ కియా మోటార్స్ ను ఏపీకి తెచ్చింది మోదీయేనని చెబుతోందని, కనీసం కోడికత్తి పార్టీకైనా అలా చెప్పేందుకు సభ్యత ఉండాలి కదా అని చంద్రబాబు విమర్శించారు.

తమిళనాడు, గుజరాత్ పోటీలో నిలిచినా ఏపీలో వెనుకబడిన జిల్లా అనంతపురానికి కియా మోటార్స్ తీసుకువచ్చానని చెప్పారు. కానీ, నరేంద్ర మోదీ ఏ పనీ చేయకపోయినా కోడికత్తి పార్టీ సిగ్గులేకుండా ఆయనకు కితాబిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీయే చెప్పుకోలేకపోతుంటే, ఏదో చేశాడని కోడికత్తి పార్టీ చెబుతోంది, వీళ్లని ఏమనాలి? అంటూ నిలదీశారు.

  • Loading...

More Telugu News