Andhra Pradesh: జగన్ ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేస్తున్నాడు!: సీఎం చంద్రబాబు

  • తెలంగాణలో ఇలాంటి అరాచకాలతోనే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది
  • ఏపీలో ఇప్పుడు అదేపని చేస్తున్నారు
  • అమరావతిలో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

తెలంగాణలో అరాచకాలు సృష్టించడం ద్వారానే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. అవే అరాచకాలను ఏపీలో ప్రయోగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎంతమందిని బదిలీ చేసుకుంటారో చేసుకోవాలని వ్యాఖ్యానించారు. పోరాటమే ఊపిరిగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. టీడీపీ కార్యకర్తల్లో పిరికితనం ఉండటానికి వీల్లేదన్నారు. అమరావతిలో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో చంద్రబాబు ఈరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునే దిశగానే టీడీపీ పోరాటం ఉంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇప్పుడు ధర్మాన్ని కాపాడుకుంటే భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. ఆ స్ఫూర్తితోనే ప్రతీఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ దర్శకత్వంలో జగన్ ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేస్తున్నారని మండిపడ్డారు.

వాళ్లు అరాచకాలు చేస్తున్నా అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని చెప్పారు. అయినా అరాచకాలు సృష్టిస్తూ అధికారులను బదిలీ చేయించే స్థాయికి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను ఏకపక్షంగా ఏపీ ప్రభుత్వంపై ప్రయోగించాలనుకుంటే ఊరుకోబోమని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News