Andhra Pradesh: ఓ నేరగాడు ప్రజలను పాలిస్తున్న అన్యాయమైన రోజులివి: చంద్రబాబుపై జగన్ ఫైర్

  • ప్రజల వ్యక్తిగత సమాచారం ప్రైవేట్ వ్యక్తుల వద్దా!  
  • అలాంటి డేటా చంద్రబాబు బినామీ కంపెనీల వద్ద ఉంది
  • బాబును మోస్తున్న మీడియాకు కనిపించడం లేదా?

ప్రజల వ్యక్తిగత సమాచారం ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉండకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని, అలాంటి డేటా చంద్రబాబు బినామీ కంపెనీల వద్ద ఉన్నాయంటే వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తున్నారో అర్థం చేసుకోవాలని వైసీపీ అధినేత జగన్ సూచించారు. నెల్లూరులో నిర్వహించిన సమర శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ, ఈ తప్పులు చంద్రబాబు మీడియాకు కనిపించడం లేదని, ప్రజల అకౌంట్లు, ఆధార్ నంబర్లు చంద్రబాబు వద్ద ఉన్నాయని విమర్శించారు. ఇలాంటి సమయంలో కూడా చంద్రబాబును మోస్తున్న మీడియాకు కనిపించడం లేదని, ప్రజల సంతకాలు కూడా  ఫోర్జరీ చేసే రోజులొచ్చేశాయని వ్యాఖ్యానించారు.

ఓ నేరగాడు ప్రజలను పాలిస్తున్న అన్యాయమైన రోజులివని, ఇలాంటి వ్యక్తి సీఎంగా పనిచేయడానికి అర్హుడా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు లేదని, రాష్ట్రంలో 39 లక్షలకు పైగా దొంగ ఓట్లు నమోదు చేయించారని, వైసీపీ సానుభూతిపరుల ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. చివరకు, మా సొంత చిన్నాన్న ఓటు కూడా తొలగించే యత్నం చేశారని అన్నారు. ఎల్లోమీడియా తనకు తోడుందని ఇష్టమొచ్చినట్టు అబద్ధాలు చెబుతున్నారని, తొలగించమని వచ్చిన అభ్యర్థనలో వైఎస్ వివేకానందరెడ్డి పేరు ఉంది కానీ నారా లోకేశ్ పేరు లేదని అన్నారు.  కలర్ ఫొటోలతో ఉన్న ఓటర్ల జాబితా ఈసీ వద్ద మాత్రమే ఉంటుందని, ఆ డేటా చంద్రబాబుకు చెందిన ప్రైవేట్ కంపెనీకి ఎలా వచ్చింది? ప్రజలకు సంబంధించిన ఆధార్ డేటా, చంద్రబాబుకు చెందిన ప్రైవేట్ సంస్థల వద్ద దొరుకుతుందంటే ఎంత పెద్ద నేరమో ఆలోచించుకోవాలని జగన్ అన్నారు.

  • Loading...

More Telugu News