India: అధికారులతో కలిసి మౌనంగా వెళ్లిపోయిన అభినందన్

  • భారత వింగ్ కమాండర్ ను అప్పగించి గేట్లు మూసిన పాక్
  • అభినందన్ కు అధికారుల సాదర స్వాగతం
  • మీడియాతో మాట్లాడిన అధికారులు

పాకిస్థాన్ చేత చిక్కి అత్యంత ధైర్యసాహసాలు కనబర్చిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఎట్టకేలకు భారత్ చేరుకున్నాడు. పాకిస్థాన్ వర్గాలు అభినందన్ ను నేటి రాత్రి లాహోర్ నుంచి వాఘా-అట్టారీ సరిహద్దు ప్రాంతానికి తీసుకువచ్చాయి. అక్కడి చెక్ పోస్టులో భారత్, పాక్ వర్గాలు పరస్పరం పత్రాలు మార్చుకున్న అనంతరం అభినందన్ స్వదేశంలో కాలుమోపాడు.

అనంతరం, పాక్ సైనిక సిబ్బంది తమ వాహనాల్లో తిరిగి లాహోర్ పయనమైంది. అయితే, అభినందన్ మాట్లాడతాడని ఆశించిన మీడియా ప్రతినిధులకు తీవ్ర నిరాశ ఎదురైంది. పాక్ సైన్యం అభినందన్ ను తీసుకువచ్చి భారత వాయుసేన ఉన్నతాధికారులకు అప్పగించగా, అభినందన్ ఆ అధికారులతో కలిసి ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్లిపోయాడు.

అభినందన్ ను చూడగానే భావోద్వేగానికి గురైన ఎయిర్ ఫోర్స్ అధికారులు అతడిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని వాహనం వరకు తోడ్కొని వెళ్లారు. తొలుత అమృత్ సర్ లో ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి, ఆపై ఢిల్లీ తీసుకెళ్లి అక్కడ మరిన్ని వైద్యపరీక్షలు నిర్వహించాలని భారత వాయుసేన భావిస్తోంది.

  • Loading...

More Telugu News