Telangana: ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియుడు.. ప్రాణాలు తీసుకున్న ఇంటర్ యువతి!

  • తెలంగాణలోని జయశంకర్ జిల్లాలో ఘటన
  • అమ్మాయి మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన
  • పరారీలో ఉన్న యువకుడు రమేశ్

ప్రేమ పేరుతో యువకుడు మోసం చేయడంతో తట్టుకోలేకపోయిన ఓ అమ్మాయి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామానికి చెందిన బోడ సింధుజ ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన బత్తుల రమేశ్ అనే యువకుడు సింధుజను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు.

దీంతో సింధుజ కూడా అతడిని ప్రేమించింది. అయితే గతకొద్దికాలంగా అతను సింధుజను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. మాట్లాడేందుకు యత్నించినా మొహం చాటేశాడు. దీంతో రమేశ్ తనను మోసం చేశాడని సింధుజ మనస్తాపానికి లోనయింది. పొలానికి కొట్టేందుకు తీసుకొచ్చిన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సింధుజను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తేల్చారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ సింధుజ తల్లిదండ్రులు కుమార్తె మృతదేహంతో రమేశ్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు. కాగా, రమేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Telangana
Jayashankar Bhupalpally District
love affair
Cheating
suicide
Police
  • Loading...

More Telugu News