Andhra Pradesh: రూ.10 లక్షలు ఇవ్వకుంటే ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాం: ఎరువుల వ్యాపారికి మావోయిస్టుల పేరిట బెదిరింపులు!

  • భయాందోళనలకు లోనయిన బాధితుడు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన చలం బాబు
  • చిత్తూరు జిల్లా పీలేరులో ఘటన

విశాఖపట్నం మన్యంలో ఇద్దరు టీడీపీ నేతలను మావోయిస్టులు హత్య చేసిన ఘటన మరువకముందే మరోసారి ఏపీలో నక్సలైట్ల కలకలం చెలరేగింది. రెండ్రోజుల్లోగా రూ.10 లక్షలు ఇవ్వకుంటే కుటుంబం మొత్తాన్ని చంపేస్తామని ఓ వ్యాపారిని గుర్తుతెలియని దుండగులు బెదిరించారు. తాము తలకోన దళం సభ్యులమని చెప్పుకొచ్చారు. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో ఆ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

జిల్లాలోని పీలేరులో చలంబాబు, తన సోదరుడు రవితో కలిసి ఎరువులతో పాటు సిమెంట్, స్టీల్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లోగా రూ.10 లక్షలు తమకు ఇవ్వకుంటే కుటుంబాన్ని చంపేస్తామని హెచ్చరించారు. తాము తలకోన దళానికి చెందినవాళ్లమని సదరు వ్యక్తులు చెప్పారు. ఈ మేరకు 9133610713 ఫోన్ నంబర్ నుంచి అన్నదమ్ములకు ఫోన్ కాల్స్, సందేశాలు వచ్చాయి.

దీంతో భయాందోళనలకు లోనయిన వీరిద్దరూ పోలీసులను ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై చలంబాబు, రవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, వీరి కుటుంబానికి రక్షణ కల్పిస్తామని పోలీస్ అధికారులు హామీ ఇచ్చారు. మరోవైపు ఈ సందేశాన్ని మాజీ నక్సలైట్లు పంపారా? లేక ఆకతాయిలు చేసిన పనా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News