Sonia Gandhi: సోనియా, రాహుల్ హాజరయ్యే మేడ్చల్ సభకు చంద్రబాబు రారట!

  • మేడ్చల్ సభ కాంగ్రెస్ పార్టీ సభే
  • చంద్రబాబు, రాహుల్ రోడ్ షో ఉంటుంది
  • హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మంలో పర్యటించే ఇద్దరు నేతలు

తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ, ఈ నెల 23న మేడ్చల్ లో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సోనియా, రాహుల్ బహిరంగ సభకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు హాజరు కాబోరని తెలుస్తోంది. పార్టీ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం, మేడ్చల్ సభ కేవలం కాంగ్రెస్ పార్టీ సభేనని, మహాకూటమిలోని ఇతర పార్టీల నేతలెవరూ హాజరు కారని సమాచారం.

ఇదే సమయంలో హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో జరిగే రోడ్ షోలలో రాహుల్ గాంధీతో కలసి చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని స్పష్టం చేసిన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆర్సీ కుంతియా, ఈ జిల్లాల్లో సీమాంధ్ర మూలాలున్న ఎంతో మంది ఓటర్లకు దగ్గర కావాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. ఇదే సమయంలో ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకమని, తెలంగాణ ఓటర్లు కీలక పాత్రను పోషించనున్నారని అన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీయేనన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళతామని కుంతియా అన్నారు. "మేడ్చల్ సభ కేవలం కాంగ్రెస్ ప్రచార సభ కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు ఆమెకు సన్మానం చేసి, గౌరవించుకునే సభ. ఈ సభకు కూటమి భాగస్వాములను ఎవరినీ పిలవలేదు" అని అన్నారు. సోనియా గాంధీ హైదరాబాద్ లో ఉన్న సమయంలో మహాకూటమి భాగస్వాములతో సమావేశం నిర్వహించే విషయంపైనా ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కుంతియా తెలియజేశారు.

  • Loading...

More Telugu News