Chandrababu: చంద్రబాబే అలా మాట్లాడితే, లోకేష్ బాగా మాట్లాడతాడా?: అంబటి రాంబాబు సెటైర్లు

  • అధికారులను మేము ఎప్పుడూ బెదిరించ లేదు
  • డీజీపీ కూడా లోకేష్ లాగానే ప్రవర్తిస్తున్నారు
  • ఈ విషయాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాం

తమ అధినేత జగన్ పై జరిగిన దాడి గురించి చంద్రబాబే అలా మాట్లాడితే, లోకేష్ బాగా మాట్లాడతాడని ఎలా అనుకుంటామని, అది పొరపాటు ఆలోచనని వైసీపీ నేత అంబటి రాంబాబు సెటైర్లు విసిరారు. జగన్ పై లోకేశ్ చేసిన ట్వీట్లు, భాష దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా లోకేశ్ చేసిన ఓ ట్వీట్ లో ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థలను, అధికారులను కించపరుస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్న జగన్ మోదీ రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారు’ అని ఉందంటూ అంబటి మండిపడ్డారు.

‘లోకేష్ గారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు గానీ, ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. అధికారులను మేము ఎప్పుడూ బెదిరించలేదు. డీజీపీ గారు సక్రమంగా వ్యవహరించలేదని చాలా స్పష్టంగా నిన్న సాయంత్రమే చెప్పాం. డీజీపీగారు కూడా లోకేష్ బాబు గారి లాగానే ప్రవర్తిస్తున్నారు. అదే విషయాన్ని ప్రజలకు మేము చెప్పే ప్రయత్నం చేశాం’ అని అంబటి అన్నారు.

‘ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారణ చేస్తే కోడి కత్తి డ్రామా వెనుక నిజాలు బయటపడతాయి అని జగన్ మోదీ రెడ్డికి భయం పట్టుకుంది. కేంద్రం నిర్వీర్యం చేసిన మోడీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నాటకాన్ని రక్తి కట్టించి, టీడీపీపై నింద వెయ్యాలి అని జగన్ కలలు కంటున్నారు’ అని లోకేష్ చేసిన మరో ట్వీట్ ను ఆయన ప్రస్తావించారు.
 
ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎంక్వైరీలన్నీ కూడా చంద్రబాబునాయుడుగారు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని, ఇది తమ విషయంలోనే కాదు, ఇంతకుముందు జరిగిన సందర్భాల్లో కూడా జరిగాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటన కేసుపై రాష్ట్ర  ప్రభుత్వ పరిధిలో విచారణ జరిగితే చంద్రబాబునాయుడు మసిపూసి మారేడు కాయ చేసి మింగేస్తాడని అంబటి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News