Chandrababu: చంద్రబాబుకి వ్యవసాయంలో అవార్డు ఇవ్వడం అంటే అవార్డునే అవహేళన చేస్తున్నట్టుంది!: వైఎస్ జగన్ విసుర్లు

  • ‘వ్యవసాయం దండగ’ అన్న వ్యక్తికి అవార్డా?
  • ఆ అవార్డును అవహేళన చేసినట్టుగా కాదా?
  • బాబుకు ‘నెంబర్ వన్ చీటర్’ అనే అవార్డు ఇవ్వాలి

ఏపీ సీఎం చంద్రబాబుకు అంతర్జాతీయ వ్యవసాయ విధాన నాయకత్వ పురస్కారం ఇస్తున్నారనే వార్తను వార్తాపత్రికల్లో చదివి ఆశ్చర్యపోయాయని వైసీపీ అధినేత జగన్ అన్నారు. విజయనగం జిల్లా గజపతినగరంలో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఇదే విషయాన్ని చంద్రబాబుకు సంబంధించిన ఎల్లోమీడియా ఊదరగొడుతూ చూపిస్తోందని ఎద్దేవా చేశారు.

అసలు చంద్రబాబునాయుడికి ఈ పురస్కారమిచ్చేదెవరో తెలుసా? బీజేపీకి చెందిన హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబునాయుడు తమకెప్పుడూ మిత్రుడేనని లోక్ సభలో నాడు రాజ్ నాథ్ సింగ్ ప్రస్తావించిన విషయాన్ని ఈ సందర్భంగా జగన్ ప్రస్తావించారు. వీళ్లిద్దరి మధ్య సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా? అని ప్రశ్నించారు.  

తాగొచ్చి భార్యను కొట్టే భర్తకు ‘ఉత్తమభర్త’ అవార్డిస్తే ఎలా ఉంటుంది?

చంద్రబాబునాయుడికి వ్యవసాయంలో అవార్డు ఇవ్వడం ఎలా ఉందంటే.. తాగొచ్చి రోజూ భార్యను కొట్టే భర్తకు ‘ఉత్తమభర్త’ అని అవార్డు ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘వ్యవసాయం దండగ’, ‘ఉచిత విద్యుత్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి’, ‘ప్రాజెక్టులు కట్టడం వల్ల ఖర్చు తప్ప రాబడి ఉండదు’, ‘సబ్సిడీలు పులిమీద సవారి లాంటివి’ అని ఇదే చంద్రబాబు గతంలో అన్నారని విమర్శించారు.

ఇలాంటి వ్యక్తికి అవార్డు ఇస్తున్నారంటే, ఆ అవార్డును అవహేళన చేసినట్టుగా కాదా? అని ప్రశ్నించారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని రైతులకు మాటిచ్చిన చంద్రబాబు వారిని మోసం చేశారని.. రైతులను దారుణంగా మోసం చేస్తున్న ఈ వ్యక్తికి ప్రపంచంలోనే ‘నెంబర్ వన్ చీటర్’ అనే అవార్డు ఏదైనా ఉంటే అది చంద్రబాబుకే ఇవ్వాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

  • Loading...

More Telugu News