Chandrababu: అనేక దేశాలు తిరిగిన ప్రధాని మోదీ ఏం సాధించారు?: సీఎం చంద్రబాబు

  • మన దేశానికి  మోదీ ఏం గుర్తింపు తెచ్చారు?
  • డిజిటల్ ఇండియాలో కేంద్రం సాధించిన ఫలితాలేంటి?
  • నేను ప్రసంగించింది ఐక్యరాజ్యసమితిలో కాదా?

అనేక దేశాలు తిరిగిన ప్రధాని నరేంద్ర మోదీ ఏం సాధించారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. అమెరికా పర్యటన ముగించుకుని ఈరోజు అమరావతి చేరుకున్న చంద్రబాబునాయుడు తన నివాసంలో పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు. తన అమెరికా పర్యటనపై బీజేపీ నేతలు విమర్శలు చేయడంపై చంద్రబాబు మండిపడ్డారు.

అన్ని దేశాలు తిరిగిన మోదీ, మన దేశానికి ఏం గుర్తింపు తెచ్చారని ప్రశ్నించారు. డిజిటల్ ఇండియాలో కేంద్రం సాధించిన ఫలితాలేంటో చెప్పాలని, ఏపీ సాధించిన ఫలితాలతో బీజేపీ నాయకులు వాటిని పోల్చి చూసుకోవాలని సూచించారు. నివసించదగిన సిటీలలో, సులభతర వాణిజ్య విధానంలో, పర్యాటకంలో, హౌసింగ్ లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు. విమర్శలు చేయడంలో తప్ప ఎందులోనూ బీజేపీ నెంబర్ వన్ స్థానంలో లేదని, చేతగాని, పసలేని విమర్శలు ఎందుకు చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు.

అసూయకు కూడా హద్దుంటుందని, తనను విమర్శిస్తే ఓట్లు పడిపోతాయనుకుంటున్నారని బీజేపీపై విమర్శలు చేశారు. ‘నా పై అవినీతి ఆరోపణలా! ‘రాఫెల్’ గురించి సమాధానం చెప్పే ధైర్యం ఉందా వీళ్లకు? వీళ్లకు అసూయతప్ప ఇంకోటి లేదు. ఎందుకంత అసూయ? నేను ప్రసంగించింది ఐక్యరాజ్యసమితిలో కాదా? యూఎన్ఈపీ ఐక్యరాజ్యసమితిలో భాగం కాదా?’ అని బీజేపీ నేతలను చంద్రబాబు ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News