Nalgonda: చికిత్సకు స్పందించని హరికృష్ణ... పరిస్థితి అత్యంత విషమం!

  • అన్నేపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
  • శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు
  • వెల్లడించిన కామినేని వైద్యులు

ఈ ఉదయం నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నందమూరి హరికృష్ణ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన చికిత్సకు స్పందించడం లేదని, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని తెలిపాయి. ఆయన తలకు తీవ్ర గాయం అయిందని, మిగతా శరీరంపై తగిలిన దెబ్బలకంటే అదే ప్రమాదమని వెల్లడించాయి. నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతోందని తెలిపాయి.

కాగా, నల్గొండ జిల్లా రహదారులు నందమూరి హరికృష్ణ కుటుంబంపై పగబట్టాయని ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న అభిమానులు విలపిస్తున్నారు. గతంలో హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రామ్ ఇదే జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. అంతకుముందు, 2009లో తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ప్రచారం నిమిత్తం వెళ్లి వస్తూ, జూనియర్ ఎన్టీఆర్ సూర్యాపేట వద్ద ప్రమాదానికి గురై తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా, ఇప్పుడు హరికృష్ణకు నల్గొండ జిల్లాలోనే ప్రమాదం జరగడం గమనార్హం.

  • Loading...

More Telugu News