Hyderabad: హైదరాబాద్‌లో ప్రేమోన్మాదం.. ప్రేమకు నిరాకరించిందని ఇంటర్ విద్యార్థిని గొంతుకోసి చంపేసిన యువకుడు!

  • ఇంటర్ బాలికను బ్లేడుతో గొంతుకోసి హతమార్చిన ఇంటర్ విద్యార్థి
  • రోడ్డుపైకి వచ్చి వీరంగం
  • దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు

హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. ప్రేమకు అంగీకరించలేదన్న కారణంతో ఓ ప్రేమోన్మాది బాలిక గొంతు కోసి హతమార్చాడు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జామై ఉస్మానియా, అంబర్‌నగర్‌కు చెందిన అనూష (16) హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. పార్శిగుట్టకు చెందిన ఆరెపల్లి వెంకట్ (18) నారాయణగూడలోని మరో కాలేజీలో ఇంటర్ సెకెండియర్ చదువుతున్నాడు. ఆరు నెలల క్రితం అనూష-వెంకట్ మధ్య పరిచయం అయింది. అప్పటి నుంచి తరుచూ వీరిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. తనతో పరిచయాన్ని ప్రేమగా భావించిన వెంకట్ మంగళవారం ఉదయం ఆమెకు ఫోన్ చేసి మాట్లాడాడు.

అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ వెనక ఉన్న పాడుబడిన క్వార్టర్స్‌లో ఇద్దరూ కలుసుకున్నారు. సాయంత్రం ఆరు గంటల వరకు అక్కడే ముచ్చట్లాడుకున్నారు. అనంతరం వెంకట్ తన ప్రేమ విషయాన్ని అనూషకు చెప్పాడు. అందుకు ఆమె నిరాకరించింది. అనూష తన ప్రేమను నిరాకరించడాన్ని జీర్ణించుకోలేకపోయిన వెంకట్ వెంటనే బ్లేడు తీసి ఆమె గొంతు కోశాడు. మూడుసార్లు వరుసగా కోయడంతో రక్తమోడుతూ అక్కడే కుప్పకూలింది.

ఆమె చనిపోయిందని భావించిన వెంకట్ రక్తపు మరకలు ఉన్న దుస్తులతో అలాగే బయటకు వచ్చి.. ‘‘అనూష నన్ను ప్రేమించలేదట. అందుకే చంపేశా’’ అంటూ పెద్దగా కేకలు వేశాడు. అప్రమత్తమైన స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అనూషను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News