Sabarimala: బ్రహ్మచారి అయిన అయ్యప్ప మహిళలను చూసేందుకు ఇష్టపడడు: సుప్రీంకోర్టులో ఆసక్తికర వాదన

  • రుతుస్రావ వయసు మహిళలను చూసేందుకు ఇష్టపడరు
  • కోట్లాది మంది భక్తుల మనోభావాలను గౌరవించాలన్న పరాశరన్
  • లింగం, కులం ఆధారంగా వివక్ష చూపించరాదన్న ధర్మాసనం

శబరిమలలోని పరమ పవిత్ర అయ్యప్ప దేవాలయంలోకి మహిళలను అనుమతించే విషయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ఆసక్తికర వాదనలు జరిగాయి. నాయర్ సొసైటీ తరఫున మాజీ అటార్నీ జనరల్ పరాశరన్ వాదనలు వినిపించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పది సంవత్సరాలలోపు, 50 ఏళ్లకు పైబడిన మహిళలను ఆలయంలోకి అనుమతిస్తున్నట్టు న్యాయస్థానానికి గుర్తు చేశారు. అయ్యప్ప నిష్ఠగల బ్రహ్మచారని, 10 నుంచి 50 ఏళ్ల వయసు... అంటే రుతుస్రావ వయసులో ఉన్న మహిళలను చూసేందుకు ఆయన ఇష్టపడడని కోట్లాది మంది భక్తులు విశ్వసిస్తున్నారని చెప్పారు. వారందరి మనోభావాలనూ గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతూ, హిందూ సంప్రదాయాల గురించి మాట్లాడారు.

పరాశరన్ వాదనలను చాలా ఓపికగా విన్న ధర్మాసనం, కేవలం లింగం, కులం ఆధారంగా ఆలయాల్లో వివక్ష చూపే సంప్రదాయాలను కొట్టివేసే అధికారం తమకుందని స్పష్టం చేసింది. మతం ప్రాతిపదికన తప్పనిసరిగా భావించే ఆచారాలకు ప్రాథమిక హక్కుల నుంచి మినహాయింపు ఇవ్వలేమని, ఇది అన్ని మతాలకూ వర్తిస్తుందని తేల్చి చెప్పింది. మహిళలపై వివక్ష చూపించే అధికారం ఎవరికీ లేదని వెల్లడిస్తూ, కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News