Karnataka: 65 ఏళ్ల భార్యకు అక్రమ సంబంధం అంటగట్టి హత్య చేసిన వృద్ధుడు.. 11 రోజుల్లోనే పూర్తయిన విచారణ.. జీవిత ఖైదు!

  • భార్యను దుడ్డుకర్రతో  మోది హత్య
  • కేసులో కీలకంగా మారిన కుమారుడి వాంగ్మూలం
  • అత్యంత వేగంగా విచారణ.. తీర్పు

భార్యను హత్య చేసిన కేసులో దోషిగా తేలిన 75 ఏళ్ల వృద్ధుడికి కర్ణాటకలోని చిత్రదుర్గ కోర్టు 11 రోజుల్లోనే జీవిత శిక్ష విధించింది. పోలీసుల కథనం ప్రకారం.. చిత్రదుర్గ తాలూకాలోని చల్లకెరెకు చెందిన పరమేశ్వర స్వామి (75) తన భార్య పుట్టమ్మ  (63)ను గత నెల 27న దుడ్డుకర్రతో బాది హత్య చేశాడు. అదే రోజు నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో పరమేశ్వరస్వామి కుమారుడు ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారిందని చిత్రదుర్గ ఎస్పీ శ్రీనాథ్ ఎం. జోషి తెలిపారు. తాము మొత్తం 30 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టామని, నిందితుడి కుమారుడు గిరీశ్ సహా 17 మంది వాంగ్మూలాలను కోర్టు పరిగణనలోకి తీసుకుందని ఎస్పీ తెలిపారు. ఫోరెన్సిక్ వివరాలను కూడా రెండు రోజుల్లోనే కోర్టుకు సమర్పించడంతో కేసు విచారణ త్వరగా పూర్తయిందని తెలిపారు.

గ్రామస్తులతో వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ తన తల్లిని తండ్రి నిత్యం వేధించేవాడని గిరీశ్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. తరచూ ఆమెతో గొడవ పడి దాడి చేసేవాడు. ఆమె హత్యకు ఇదే కారణమని పోలీసులు నిర్ధారించారు. కేసు పూర్వాపరాలను విశ్లేషించిన కోర్టు నిందితుడిని దోషిగా తేలుస్తూ జీవిత ఖైదు విధించింది. కేవలం 11 రోజుల్లోనే ఓ కేసులో తీర్పు రావడం గమనార్హం.

  • Loading...

More Telugu News