Pawan Kalyan: అంతా ఆయన భ్రమ... మేమేమీ పవన్ వల్ల గెలవలేదు: యనమల కీలక వ్యాఖ్యలు

  • ప్రజల మద్దతుతోనే అధికారంలోకి వచ్చాం
  • ఓ వైపు బీజేపీ, మరోవైపు లెఫ్ట్ తో స్నేహమా?
  • పవన్ పై యనమల విమర్శలు

తాను చేసిన ప్రచారం వల్లనే తెలుగుదేశం పార్టీకి అధికారం దక్కిందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం ఆయన అవగాహనా లేమికి నిదర్శనమని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం అమరావతిలో మీడియాతో మట్లాడిన ఆయన, ఓ వైపు బీజేపీతో అంటకాగుతూ, మరోవైపు లెఫ్ట్ పార్టీలతో మీటింగ్ లు పెట్టే ఆయన, తెలుగుదేశం పార్టీపై చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోవడం లేదని అన్నారు. ఉత్తరాంధ్ర ఉద్యమమంటూ యువతను ఆయన రెచ్చగొడుతున్నారని, ఆయన వల్లే తాము అధికారంలోకి రాలేదని, ప్రజలు నమ్మడం వల్లే వచ్చామని అన్నారు.

 ఆయన బీజేపీతో ఉంటారో, లెఫ్ట్ నేతలతో ఉంటారో ఆయన స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాటనని పవన్ వైఖరిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. జగన్, పవన్ వంటి వాళ్లు ఎంతమంది వచ్చినా తెలుగుదేశాన్ని అడ్డుకోలేరని అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేయడం నమ్మక ద్రోహానికి పరాకాష్టగా అభివర్ణించిన యనమల, రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలం అయ్యాయని తప్పుడు ఫిర్యాదు చేస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంపై పెత్తనం సాగించాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News