Kadiam Srihari: ఎమ్మెల్యే రాజయ్యకు, నాకు మధ్య అభిప్రాయభేదాలు లేవు: కడియం శ్రీహరి

  • ఘన్‌పూర్‌ ప్రజల ఆశీర్వాదం వల్లే ఉప ముఖ్యమంత్రి అయ్యాను
  • తలదించుకునే తప్పు ఎప్పటికీ చేయను
  • ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ లంచం తీసుకోలేదు

వరంగల్‌ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం వల్లే తాను నేడు తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నానని కడియం శ్రీహరి అన్నారు. ఆ నియోజక వర్గ ప్రజల రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనని ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజక వర్గంలోని తాటికొండ గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యకు, నాకు మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు. మేము కలిసి పనిచేస్తున్నాం. పార్టీ ఇచ్చే అవకాశాన్ని బట్టి పనిచేస్తాం..

స్టేషన్ ఘన్ పూర్ ప్రజల నాయకుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఇక్కడి ప్రజలు తల ఎత్తుకునే విధంగానే వ్యవహరించాను. ఈ నియోజక వర్గ ప్రజలు తలదించుకునే తప్పు పని ఇప్పటి వరకు చేయలేదు. ఇక కూడా చేయనని హామీ ఇస్తున్నాను. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేస్తాను. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఈ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తాను.

ఆనాడు భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఈ నియోజక వర్గానికి గోదావరి నీటిని తీసుకొచ్చే దేవాదులను ప్రారంభించాను. అప్పుడు దీనిని ఎన్నికల కోసం చేస్తున్నారని చాలా మంది విమర్శించారు. కానీ నేడు దానివల్లే స్టేషన్ ఘన్ పూర్ లో సాగునీరు అందుతోంది. నేడు విద్యాశాఖ మంత్రిగా లింగంపల్లి రిజర్వాయర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చి లింగంపల్లి ప్రాజెక్టు పట్టుకొచ్చాను.

రాష్ట్రంలోని పూర్వ పది జిల్లాల్లో జిల్లాకొక పెద్ద రిజర్వాయర్ ఉంది. వ్యవసాయం మీద ఆధారపడిన వరంగల్ జిల్లాకు పెద్ద రిజర్వాయర్ లేదు. లింగంపల్లి వద్ద రిజర్వాయర్ కడితే బాగుంటుందని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే అంగీకరించారు. 2,700 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పరిపాలన అనుమతులు వచ్చాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయి.

ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే పూర్వ వరంగల్ లోని అన్ని నియోజక వర్గాలకు రెండు పంటలకు నీరు అందుతుంది. తాటికొండ, మీదికొండ, కొత్తపల్లి గ్రామాలలో 4 లేక 5 వేల ఎకరాలకు నీరందించి సస్యశ్యామలం చేసే కృషి చేస్తాను. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేపడుతున్న అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రశంసిస్తున్నారు" అని అన్నారు.      

  • Loading...

More Telugu News