Chandrababu: ఒకరినొకరు పలకరించుకుని.. కుశలప్రశ్నలు వేసుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్!

  • వెంకటేశ్వరస్వామి గర్భగుడిలో మాట్లాడుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
  • ఎలా ఉన్నారంటూ పరస్పరం కుశలప్రశ్నలు
  • తీర్థ ప్రసాదాలు ముందు చంద్రబాబుకే ఇవ్వాలన్న పవన్

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ పత్రిష్టాపన కార్యక్రమం సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు ఒకరినొకరు పలకరించుకున్నారు. పరస్పరం యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. దీనికి ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు పక్కపక్కనే ఉన్నప్పటికీ మాట్లాడుకోలేదంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

దేవాలయానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడివిడిగా వచ్చారు. ఆలయం వెలుపల ఉన్న టీవీ విజువల్స్ లో వీరు పలకరించుకోకపోవడం కనిపించింది. అయితే, లోపలకు వెళ్లిన తర్వాత వీరిద్దరి మధ్య పలకరింపులు చోటు చేసుకున్నాయి. వీటికి సంబంధించిన విజువల్స్ మాత్రం కెమెరా కంటికి చిక్కలేదు. ఈ సందర్భంగా మంత్రులు, టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పవన్ కల్యాణ్ అనుచరులు కూడా వారితో పాటు ఉన్నారు. వీరంతా బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు నేతలు పలకరించుకున్న విషయాన్ని వెల్లడించారు.

వారు చెప్పిన వివరాల ప్రకారం... గర్భగుడిలో విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రాంతంలో నవధాన్యాలను ఉంచే సందర్భంగా... పక్కన ఉన్న పవన్ చూసి చంద్రబాబు నవ్వుతూ పలకరించారు. దీనికి స్పందనగా 'ఎలా ఉన్నారు?' అంటూ చంద్రబాబును పవన్ కల్యాణ్ కుశల ప్రశ్నలు వేశారు. దీనికి సమాధానంగా... బాగున్నాను అంటూ చంద్రబాబు చెప్పారు. మీరెలా ఉన్నారు? అంటూ పవన్ ను ప్రశ్నించారు. వీరిద్దరి మధ్య ఈ కుశలప్రశ్నల సన్నివేశం నిమిషం పాటు కొనసాగింది.

ఆ తర్వాత ఇద్దరూ నవధాన్యాలను విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రాంతంలో ఉంచారు. అనంతరం తీర్థప్రసాదాలను అందించే సమయంలో... గణపతి సచ్చిదానందస్వామికి కుడివైపు చంద్రబాబు, ఎడమవైపు పవన్ కల్యాణ్ నిల్చున్నారు. ఎడమవైపు నుంచి తీర్థప్రసాదాలు ఇస్తున్న క్రమంలో, ముందు చంద్రబాబుకు ఇవ్వాలంటూ పవన్ కల్యాణ్ స్వామీజీని కోరారు.

  • Loading...

More Telugu News