Chandrababu: నీతి ఆయోగ్ వేదికగా చేసిన డిమాండ్ల గురించి.. వివరించి చెప్పిన చంద్రబాబు

  • ఏపీలో సాధించిన అభివృద్ధిని చెప్పాం
  • పంటల మద్దతు ధరలో లోపాలను చర్చనీయాంశం చేశాం
  • స్వామినాథన్ సిఫారసులను అమలు చేయకపోవడాన్ని నిలదీశాం
  • నరేగాను వ్యవసాయానికి అనుసంధానించాలని డిమాండ్ చేశాం

ఏపీలో సాధించిన అభివృద్ధిని నీతి ఆయోగ్ సమావేశంలో దేశం దృష్టికి తెచ్చామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు నిర్వహించిన నీరు-ప్రగతి, వ్యవసాయంపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ... "మన రాష్ట్రంలో జల సంరక్షణ, పంట మార్పిడి, పండ్ల తోటల వృద్ధిపై ప్రజెంటేషన్ ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ విధానాలు జాతీయ స్థాయిలో ఒక నమూనాగా మారాయి.

పంటల మద్దతు ధరలో లోపాలను చర్చనీయాంశం చేశాం. స్వామినాథన్ సిఫారసులను అమలు చేయకపోవడాన్ని నిలదీశాం. నరేగాను వ్యవసాయానికి అనుసంధానించాలని డిమాండ్ చేశాం. రైతుల రాబడి రెట్టింపు అయ్యేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించాం. నీటి నిర్వహణలో గుజరాత్, మధ్యప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్ మొదటి 3 స్థానాలలో ఉన్నాయి. మొదటిస్థానం పొందేందుకు మరింత సమర్థంగా కృషి చేయాలి. నీటి నాణ్యతపై, రక్షిత తాగునీటి సరఫరాపై మరింత దృష్టి పెట్టాలి. వర్షపాతం తక్కువ ఉన్నా సమర్థ నీటి నిర్వహణ ద్వారా నీటి కొరత అధిగమించాలి. రెయిన్ గన్ టెక్నాలజీ, జీబా టెక్నాలజీ సద్వినియోగం చేసుకోవాలి.

గతేడాది కన్నా తాగునీటి రవాణా గ్రామాల సంఖ్య సగానికి తగ్గింది. తాగునీరు రవాణా చేసిన 500 గ్రామాల్లో ఇంజక్షన్ బోర్ వెల్స్ చేపట్టాలి. వచ్చే ఏడాది తాగునీటి రవాణా అనేదానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. కేవలం నీటి భద్రత ఇవ్వడమే కాదు, నాణ్యమైన నీటిని అందుబాటులోకి తేవాలి. వాతావరణ సమస్యలను అధిగమించాలి. అప్పుడే సుస్థిర ఆర్థికాభివృధ్ధిని సాధించగలం.

ఈ నెల 17 రోజుల్లో నరేగాలో రూ.576 కోట్ల పనుల లక్ష్యం చేరాం. మిగతా 13 రోజుల్లో రూ.1,000కోట్ల టార్గెట్ అధిగమించాలి. మద్దతు ధర,డిమాండ్ ను బట్టి పంట మార్పిడిని ప్రోత్సహించాలి. ఘన వ్యర్థాల నిర్వహణ మరింత సమర్థంగా జరగాలి. ఓడీఎఫ్ తరహాలో సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. షెడ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేయాలి. మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రూ.830 కోట్లు సిద్ధంగా ఉన్నాయి. సిమెంట్ రోడ్లు, డ్రెయిన్లు తదితర పనులు ముమ్మరం చేయాలి. మొక్కలు నాటడం, చెట్ల
సంరక్షణలో డ్వాక్రా మహిళల సేవలు వినియోగించుకోవాలి.

ప్రతి గ్రామంలో, వార్డులో వృక్ష మిత్రలను ప్రోత్సహించాలి. వ్యవసాయంలో సంక్షోభం అధిగమించాం. జల సంరక్షణ ముమ్మరం చేశాం. గ్రామాల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేశాం. పేదల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాం. ఇన్నిపనులు చేయడంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు. జనవరికల్లా ప్రజల్లో సంతృప్తి 90%కు చేరుకోవాలి. అధికారులు మరింత సమర్థంగా, సమన్వయంగా పనిచేయాలి. ఈ టెలికాన్ఫరెన్స్ లో వివిధ శాఖల అధికారులు శశిభూషణ్, రాజశేఖర్, రామాంజనేయులు, రంజిత్ బాషా, అరుణ్ కుమార్ ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News